విజయవాడ ఎంపీ చిన్నిపై ఈడీకి లెటర్ రాసిన మాజీ ఎంపీ కేశినేని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంపీ కేశినేని చిన్నిపై ఇటీవల కేశినేని నాని సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు. దీంతో కేశినేని నానిపై పటమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎంపీ కేశినేని చిన్ని. సోషల్ మీడియాలో తనపై అనుచిత పోస్టులు పెడుతున్నారంటూ కేశినేని చిన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేశినేని నానిపై FIR No:239/2026 U/s 204, 351, 352, 353, 356, 61 BNS and 66, 66(C ), 66(D), 67, 72 IT Act సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదిఇలా ఉండగా ఎంపీ చిన్ని అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆయనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి కేశినేని నాని రాశారు. కేశినేని చిన్ని కుటుంబంతో పాటు 'కేసిరెడ్డి నెట్వర్క్' ఆర్థిక లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు జరపాలని నాని డిమాండ్ చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద వీరి వ్యాపారాలు, నెట్వర్క్లపై ఈడీ తక్షణమే విచారణ చేపట్టాలని ఆయన తన లేఖలో కోరారు. చిన్ని అనేక అక్రమాలకు పాల్పడ్డారని, దీని వెనుక పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఎంపీ కేశినేని చిన్ని చట్టాన్ని, న్యాయస్థానాలను సైతం తప్పుదారి పట్టించారంటూ నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన ఈడీ అటాచ్మెంట్స్ (ఆస్తుల జప్తు) వివరాలను, బ్యాంకులకు సంబంధించిన కీలక ఆర్థిక విషయాలను దాచిపెట్టి, సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించేలా వ్యవహరించారని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటిపై లోతైన విచారణ జరిపితే మరిన్ని నిజాలు బయటకు వస్తాయని అన్నారు. అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో జరిగిన అవినీతిపై కూడా దర్యాప్తు జరపాలని, ఈ అవినీతి నెట్వర్క్లో ఎంపీ పాత్రపై స్పష్టత రావాలని డిమాండ్ చేశారు.
0 Comments