ఆరో తరగతి నుండి పైతరగతుల విద్యార్థులు మూడు భాషలను అభ్యసించాలని, వాటిలో కనీసం రెండు భారతీయ భాషలై ఉండాలని తాజాగా తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వ్యక్తం కావడంతో సీబీఎస్ఈ బోర్డు వెనక్కి తగ్గింది. ఏడో తరగతి నుంచి పదో తరగతి విద్యార్ధుల వరకూ పాత విధానమే అమలు చేయాలని నిర్ణయించింది. ఆరో తరగతి విద్యార్ధులకు మాత్రమే త్రిభాషా సూత్రం వర్తిస్తుందని తెలిపింది. తాజాగా ప్రకటించిన కొత్త 'మూడు భాషల విధానం' పాఠశాలలు, విద్యార్థులు, తల్లిదండ్రులలో గందరగోళాన్ని సృష్టిస్తున్న నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రస్తుతం 7, 8, 9, 10వ తరగతుల్లో ఉన్న విద్యార్థుల కోసం పలు సడలింపులు ప్రకటించింది. ప్రస్తుత 10వ తరగతి బ్యాచ్ (2026-27) పాత 'రెండు భాషల విధానం' ప్రకారమే కొనసాగుతుందని, వారు సవరించిన భాషా విధానాన్ని అనుసరించాల్సిన అవసరం లేదని బోర్డు స్పష్టం చేసింది. అలాగే ప్రస్తుతం 7, 8, 9వ తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు సెకండరీ దశకు చేరుకున్నప్పుడు, మూడవ భాషలో 10వ తరగతి బోర్డు పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదని కూడా స్పష్టం చేసింది. తాజా మార్గదర్శకాలలో, 2026-27 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో చదువుతున్న విద్యార్థులకు ఎటువంటి మార్పు ఉండదని సీబీఎస్ఈ పేర్కొంది. 2026-27లో 10వ తరగతిలో ఉన్న విద్యార్థులకు ఎటువంటి మార్పు ఉండదని, వారు పాత రెండు భాషల విధానాన్నే కొనసాగిస్తారని తెలిపింది. ఈ బ్యాచ్ విద్యార్థులు మూడవ భాషను తీసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పేసింది.
0 Comments