హైదరాబాద్ లోని గండిపేట భూకబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి రంగారెడ్డి కోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. ప్రతి 15 రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్లో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. రూ.20 వేల చొప్పున రెండు ష్యూరిటీలు సమర్పించాలని రంగారెడ్డి న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో సాక్షులను, విచారణను ప్రభావితం చేసే విధంగా ప్రవర్తించవద్దని షరతుల్లో పేర్కొంది. ఫేక్ జీవో కేసులో ఇప్పటికే ఈవోడబ్ల్యూ పోలీసులు మూడు రోజుల పాటు బొల్లా బ్రహ్మనాయుడిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. కస్టడీ ముగిసిన తర్వాత ఆయనను జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ బొల్లా బ్రహ్మనాయుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు ముగిసిన అనంతరం మాజీ ఎమ్మెల్యేకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, కస్టడీలో మాజీ ఎమ్మెల్యే సరైన సమాధానాలు చెప్పలేదని, ఏ ప్రశ్నలు అడిగా తనకు తెలీదని మాత్రమే చెప్పారని, తాము ఆశించిన స్థాయిలో విచారణకు సహకరించలేదంటూ న్యాయస్థానం దృష్టికి పోలీసులు తీసుకెళ్లారు. కస్టడీ పూర్తి అయినందుకు బెయిల్ పొందేందుకు అర్హుడే అంటూ బొల్లా బ్రహ్మనాయుడు తరఫు న్యాయవాదులు వాదించారు. దీంతో మాజీ ఎమ్మెల్యేకు రంగారెడ్డి జిల్లా కోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది.
0 Comments