పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్కు చెందిన ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త మెహ్రాంగ్ బలోచ్కు క్వెట్టాలోని ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. 2024 జూలైలో జరిగిన ఒక భారీ నిరసన ప్రదర్శనలో పారామిలిటరీ సైనికుడిని హత్య చేసినందుకు, అలాగే ఉగ్రవాద సంబంధిత ఆరోపణలపై కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించింది. 2025 మార్చి నుంచి కస్టడీలోనే ఉన్న మెహ్రాంగ్కు విధించిన ఈ శిక్ష ప్రస్తుతం పాకిస్తాన్లో మానవ హక్కులు, అక్కడి న్యాయ ప్రక్రియ విశ్వసనీయతపై తీవ్ర చర్చకు దారితీసింది. క్వెట్టా ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం మెహ్రాంగ్ బలోచ్తో పాటు ఆమె సహచరుడు సిబ్ఘతుల్లాను కూడా ఈ కేసులో దోషులుగా ప్రకటించింది. న్యాయస్థానం వెల్లడించిన వివరాల ప్రకారం.. జూలై 2024లో గ్వాదర్లో జరిగిన ఒక నిరసన ప్రదర్శన సందర్భంగా అక్కడ విధుల్లో ఉన్న పారామిలిటరీ సైనికుడు సిపాయి షబీర్ బలోచ్ దారుణ హత్యకు గురయ్యాడు. భద్రతా దళాలపై దాడికి దిగాలంటూ మెహ్రాంగ్ బలోచ్ నిరసనకారులను తీవ్రంగా రెచ్చగొట్టారని కోర్టు నిర్ధారించింది. ప్రాసిక్యూషన్ సమర్పించిన ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, వైద్యపరమైన ఆధారాలు బలోచ్పై ఉన్న ఆరోపణలను నిజమని నిరూపిస్తున్నాయని కోర్టు తన తీర్పులో పేర్కొంది. బలూచిస్తాన్లో దశాబ్దాలుగా జరుగుతున్న బలవంతపు అకృత్యాలు, మిలిటరీ అరాచకాలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై మెహ్రాంగ్ బలూచ్ అంతర్జాతీయ స్థాయిలో గళం విప్పుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు శిక్ష పడటంపై మానవ హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు. నిందితులను జైలు నుంచే వీడియో లింక్ ద్వారా కోర్టు విచారణకు హాజరు కావాలని ఒత్తిడి చేయడంతో, వారు ఈ విచారణను పూర్తిగా బహిష్కరించారని కార్యకర్తలు విమర్శించారు. బలూచ్ యక్జహతి కమిటీ ఆర్గనైజర్ అయిన లాలా అబ్దుల్ బలూచ్, ఈ విచారణను ఒక “ముఖం లేని విచారణ” అని అభివర్ణించారు. ఈ ఏకపక్ష నిర్ణయం బలూచ్ సమాజానికి, పాక్ ప్రభుత్వానికి మధ్య ఉన్న నమ్మకాన్ని మరింతగా దెబ్బతీస్తుందని, ప్రాంతీయ నిరసనలను మరింతగా రెచ్చగొడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు బలూచిస్తాన్ ప్రభుత్వం ఈ తీర్పును పూర్తిగా స్వాగతించింది. విధి నిర్వహణలో ఉంటూ ప్రాణాలు కోల్పోయిన సైనికుడు షబీర్ బలూచ్ కుటుంబానికి ఎట్టకేలకు న్యాయం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టి వ్యాఖ్యానించారు. శాంతియుత నిరసనల ముసుగులో హింసను ప్రేరేపించడం, ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకోవడం ముమ్మాటికీ ఉగ్రవాదమేనని ఆయన స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారు ఎంతటి వారైనా ఉగ్రవాద నిరోధక చట్టాల కింద కఠిన చర్యలు తప్పవని ఈ తీర్పు నిరూపించిందని ప్రభుత్వం పేర్కొంది. ఈ అన్యాయమైన తీర్పును తాము అంగీకరించబోమని, దీనిని త్వరలోనే బలూచిస్తాన్ హైకోర్టులో సవాలు చేస్తామని మెహ్రాంగ్ బలూచ్ తరఫు న్యాయవాది ఇస్రార్ జట్టక్ వెల్లడించారు. కాగా, ఈ తీర్పుకు నిరసనగా బలూచ్ యక్జహతి కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయి సమ్మెకు పిలుపునిచ్చింది. దీనితో బలూచిస్తాన్లోని పలు ప్రాంతాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
0 Comments