డీఆర్డీఓ కొత్త డైరెక్టర్ జనరల్ (క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థలు)గా ప్రముఖ రక్షణ రంగ శాస్త్రవేత్త డాక్టర్ జగన్నాథ్ నాయక్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న యు. రాజా బాబు పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో జగన్నాథ్ నాయక్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆయన డీఆర్డీఓ పరిధిలోని ‘సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్’ డైరెక్టర్గా సేవలందిస్తున్నారు. డాక్టర్ జగన్నాథ్ నాయక్కు డిఫెన్స్ రీసెర్చ్ రంగంలో 35 సంవత్సరాలకు పైగా అపారమైన అనుభవం ఉంది. భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేసే ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఆయన భాగస్వామిగా ఉన్నారు. ముఖ్యంగా దేశీయ సాంకేతికతతో రూపొందించిన తొలి ‘డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్’ సిస్టమ్ డెవలప్మెంట్లో ఆయన పాత్ర ఎంతో కీలకమైనది. దీనితో పాటు ఆకాశ్ మిస్సైల్ సిస్టమ్కు సంబంధించిన ‘ఫైబర్ ఆప్టిక్ గైరో గైడెన్స్ టెక్నాలజీ’, శత్రు డ్రోన్లను తిప్పికొట్టే అధునాతన యాంటీ డ్రోన్ వ్యవస్థల రూపకల్పనలో ఆయన విశేష కృషి చేశారు. శాస్త్రవేత్తగానే కాకుండా పరిశోధన రంగంలోనూ జగన్నాథ్ నాయక్ తన ముద్ర వేశారు. ఇప్పటివరకు వివిధ అంతర్జాతీయ, జాతీయ వేదికలపై 125కు పైగా పరిశోధనా పత్రాలను ప్రచురించడంతో పాటు పలు టెక్నికల్ బుక్స్ కూడా రాశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ప్రతిష్టాత్మక ‘ఆర్యభట అవార్డు’ సహా పలు జాతీయ పురస్కారాలు ఆయన్ను వరించాయి. డాక్టర్ జగన్నాథ్ నాయక్ సారథ్యంలో డీఆర్డీఓ మిస్సైల్, వ్యూహాత్మక ఆయుధాల తయారీ విభాగం మరింత వేగంగా దూసుకుపోతుందని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆత్మనిర్భర్ భారత్’ నినాదానికి తగ్గట్టుగా.. భవిష్యత్ యుద్ధ అవసరాలకు సరిపోయే లేజర్ ఆయుధాలు, యాంటీ డ్రోన్ టెక్నాలజీ, అత్యాధునిక క్షిపణుల అభివృద్ధిపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. డీఆర్డీఓలో సాధారణ శాస్త్రవేత్తగా కెరీర్ ప్రారంభించి.. నేడు అత్యున్నత స్థాయి డైరెక్టర్ జనరల్ పదవికి చేరుకున్న ఆయన ప్రస్థానం యువ సైంటిస్టులకు ఎంతో స్ఫూర్తిదాయకం.
0 Comments