Ad Code

పెన్షన్ విధానం మార్పు, రిటైర్మెంట్ వయస్సు పొడిగింపుపై ఏపీ రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఎప్పటి నుంచో కోరుతున్న పెన్షన్ విధానం మార్పు, రిటైర్మెంట్ వయస్సు పొడిగింపు వంటి కీలక నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలతో వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరబోతోంది. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో 01-09-2004కు ముందు నోటిఫికేషన్లు జారీ అయ్యి, అనంతరం ప్రభుత్వ సేవలో చేరిన ఉద్యోగులను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నుండి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పరిధిలోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న సుమారు 11,000 మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. వారి పదవీ విరమణ అనంతర జీవితానికి, కుటుంబానికి ఆర్థిక భద్రత, సామాజిక రక్షణ కల్పించే దిశగా ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయంగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం తెలిపింది. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల పాఠశాలలు, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును సైతం 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల పాఠశాలలు, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 సంవత్సరాలకు పెరగనుంది. దీనిని జనవరి 1, 2022 నుండి పాత తేదీతో వర్తింపజేస్తూ, అప్పటి నుండి విశ్రాంతి పొందిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేలా సర్వీస్ రూల్స్ సవరించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలపై రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల నేతలు వేర్వేరు ప్రకటనలో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu