భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ గ్యాస్ సిలిండర్ సరఫరాకు సంబంధించి కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. భారత్ గ్యాస్ సిలిండర్ బుకింగ్, డెలివరీ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ఉద్దేశించిన డెలివరీ అథెంటికేషన్ కోడ్ ను ఇకపై తప్పనిసరి చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. ఇకపై భారత్ గ్యాస్ యూజర్లు.. సిలిండర్ డెలివరీ సమయంలో డీఏసీ కోడ్ ను తప్పనిసరిగా డెలివరి బాయ్ తో షేర్ చేసుకోవాలని బీపీసీఎల్ సూచించింది. లేనిపక్షంలో గ్యాస్ సిలిండర్ ను తిరిగి వెనక్కి పంపనున్నట్లు హెచ్చరించింది. కొత్త నిబంధనల ప్రకారం.. వినియోగదారులు గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వెంటనే వారి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఒక డెలివరీ అథెంటికేషన్ కోడ్ లేదా ఒక ఓటీపీ వస్తుంది. గ్యాస్ డెలివరీ బాయ్ ఇంటికి సిలిండర్ తీసుకొచ్చినప్పుడు ఈ కోడ్ను అతనికి చెప్పాల్సి ఉంటుంది. అతను తన యాప్లో ఈ కోడ్ను ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేశాకే సిలిండర్ అందజేస్తారు. భారత్ గ్యాస్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా కమర్షియల్ డెలివరీల కోసం ‘డీఏసీ’ సదుపాయాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. సిలిండర్ ఖచ్చితమైన కస్టమర్కు సురక్షితంగా చేరడమే దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. కస్టమర్లు సిలిండర్ చేతికి అందిన తర్వాత మాత్రమే ఈ డీఏసీ లేదా ఓటీపీని డెలివరీ బాయ్తో పంచుకోవాలని సూచించింది. డెలివరీ పూర్తయిన తర్వాత డిజిటల్ క్యాష్ మెమో మొబైల్కు వస్తుందని తెలియజేసింది.
0 Comments