తెలంగాణాలోని ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో ఇళ్ల స్థలాల నిర్వాసితులతో నిర్వహించిన ఉమ్మడి సమావేశంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టి. హరీశ్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణాలో హిట్లర్ తరహా పాలన నడుస్తోందని, ఖమ్మం జిల్లాలో నిరుపేదల ఇళ్లను కూల్చివేస్తూ ప్రభుత్వం దమనకాండకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. పేదలకు రక్షణగా నిలవాల్సిన రెవెన్యూ మంత్రి, ల్యాండ్ గ్రాబర్గా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రఘునాథపాలెం పరిధిలోని సర్వే నంబర్ 218లో 625 నిరుపేద కుటుంబాలకు తాము ఇళ్ల పట్టాలు అందజేశామని హరీశ్ రావు గుర్తుచేశారు. గృహలక్ష్మి పథకం కింద వారికి లబ్ధి చేకూర్చామని, ఆ నమ్మకంతో నిరుపేదలు అప్పులు సప్పులు చేసి ఇళ్ల నిర్మాణాలు చేపడితే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జేసీబీలతో వాటిని కూల్చివేయడం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన చింతకాని మండలంలో నిర్వహించనున్న 'రైతు ఆశీర్వాద సభ'పై హరీశ్ రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దానిని 'రైతుల క్షమాపణ సభ'గా మార్చుకోవాలని హితవు పలికారు. రైతుబంధు చెల్లింపులు, రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్ల అంశాల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక తీరును ఆయన తప్పుబట్టారు. జిల్లాలో నెలకొన్న భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్కు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో హరీశ్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పలువురు ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
0 Comments