దేశీయ విఫణిలో మే నెలలో ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగింది. అమ్మకాల్లో మారుతి సుజుకి ఆధిపత్యం చెలాయించింది. ఈ బ్రాండ్ మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకోవడమే కాకుండా, దేశంలో అత్యధికంగా అమ్ముడైన 10 కార్ల జాబితాలో ఆరు మోడళ్లకు స్థానం కల్పించింది. టాటా మోటార్స్, మహీంద్రా, హ్యుందాయ్ కూడా మంచి అమ్మకాలను నమోదు చేశాయి. అమ్మకాల్లో మారుతి సుజుకి డిజైర్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ కాంపాక్ట్ సెడాన్ మే 2026లో 24,546 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. మంచి మైలేజ్, సౌకర్యం, తక్కువ ధర కారణంగా ఇది వినియోగదారుల మొదటి ఎంపికగా మారింది. రెండవ స్థానంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ నిలిచింది. ఈ మోడల్ 20,686 యూనిట్ల అమ్మకాలతో 52 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. వేగంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇది మార్కెట్లో హాట్ సెల్లింగ్ మోడల్గా మారింది. మూడవ స్థానంలో మారుతి సుజుకి ఎర్టిగా నిలిచింది. కుటుంబ అవసరాలకు అనుకూలంగా ఉండే ఈ ఎంపీవీ 20,350 యూనిట్ల అమ్మకాలతో 26 శాతం వృద్ధిని సాధించింది. నాలుగవ స్థానంలో టాటా పంచ్ నిలిచింది. టాప్ 10 అమ్మకాల జాబితాలో ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ చోటు సంపాదించుకుంది. దీనికి కూడా వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ మోడల్ 20,208 యూనిట్ల అమ్మకాలు చేసి 54 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఐదవ స్థానంలో టాటా నెక్సాన్ నిలిచింది. పెట్రోల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉన్న ఈ కారు మొత్తమ్ 19,100 యూనిట్ల అమ్మకాలతో 46 శాతం వృద్ధిని చూపింది. ఆరవ స్థానంలో మారుతి సుజుకి బాలెనో నిలిచింది. ఇది 18,396 యూనిట్లు అమ్ముడై, టాప్ 10లోనే అత్యధిక వృద్ధి రేటు (58%) సాధించింది. ఏడు, ఎనిమిది స్థానాల్లో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్, మారుతి సుజుకి స్విఫ్ట్ చోటు సంపాదించుకున్నాయి. వీటి అమ్మకాలు వరుసగా 18,076.. 17,519 యూనిట్లుగా నమోదయ్యాయి. ఎంట్రీ లెవల్, యూత్ సెగ్మెంట్లో ఇవి ఇప్పటికీ బలమైన డిమాండ్ను కొనసాగిస్తున్నాయి. తొమ్మిదవ స్థానంలో మహీంద్రా స్కార్పియో నిలిచింది. దీని క్లాసిక్, కొత్త వెర్షన్లు కలిపి 15,774 యూనిట్లు అమ్ముడయ్యాయి. పదవ స్థానంలో హ్యుందాయ్ క్రెటా నిలిచింది. కఠినమైన పోటీ ఉన్నప్పటికీ ఇది 15,253 యూనిట్ల అమ్మకాలతో స్థిరమైన పనితీరు చూపించింది.
0 Comments