హైదరాబాద్, బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రికవరీ హాస్పిటల్లో డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఖాసిం అదే ఆసుపత్రిలో విషపూరిత ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. హాస్పిటల్లోని రూమ్ నంబర్ 201లో లోపలి నుంచి తాళం వేసుకుని ఆయన సూసైడ్ చేసుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న వైద్యుడు ఆసుపత్రి గదిలో ప్రాణాలు తీసుకోవడం తీవ్ర కలకలం రేపింది. డాక్టర్ ఖాసిం మృతిపై ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యం నుంచి ఎదురవుతున్న విపరీతమైన పని ఒత్తిడి, మానసిక వేధింపుల వల్లే ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. యాజమాన్యం పెట్టే ఇబ్బందులను తట్టుకోలేకనే డాక్టర్ ఖాసిం బలవన్మరణానికి పాల్పడ్డారని వారు వాపోతున్నారు. అంతేకాకుండా, ఈ ఘటన జరిగిన తర్వాత ఆసుపత్రి యాజమాన్యం ఉదంతాన్ని గుట్టుచప్పుడు కాకుండా దాచేందుకు ప్రయత్నించిందని బంధువులు ఆరోపించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని అత్యంత వేగంగా పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారని వారు పేర్కొన్నారు. దీనికి కారణమైన ఆసుపత్రి యాజమాన్యంపై సమగ్ర దర్యాప్తు జరిపి, తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
0 Comments