సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ లావాదేవీలకు కొత్త నిబంధన విధించేందుకు సిద్దమవుతోంది. రూ.10 వేల కంటే ఎక్కువ నగదు ఆన్లైన్ ద్వారా పంపించాలనుకుంటే ఒక గంట కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది. ఆలోపు మీరు కావాలనుకుంటే ట్రాన్సాక్షన్ రద్దు చేయవచ్చు. పుష్ పేమెంట్ మోసంతో మోసగాళ్లు ప్రజలను మోసగించి వెంటనే డబ్బు బదిలీ చేయించే కేసులను నివారించేందుకు ఆర్బీఐ ఈ కొత్త నిబంధన తీసుకొచ్చింది. త్వరలోనే దీనిని ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. బ్యాంకులు కూడా ఈ విధానానికి ఆమోద తెలిపాయి. తాము పంపే డబ్బు సరైన గమ్యస్థానానికి చేరుస్తుందో లేదో ఆలోచించుకోవడానికి, అంచనా వేసుకోవడానికి వినియోగదారులకు ఈ గంట ఆలస్యం సమయం ఉపయోగపడుతుందని బ్యాంకులు చెబుతున్నాయి. అయితే కూలింగ్ పీరియడ్ను అమలు చేసేందుకు బ్యాంకులు సిద్దంగా ఉన్నప్పటికీ కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. ఈ నిబంధనను కొన్ని లావాదేవీలకు మాత్రమే పరిమితం చేయాలని సూచిస్తున్నాయి. రూ.10 వేల కంటే ఎక్కువ ఖర్చు చేసి మొబైల్ కొనుగోలు చేసినప్పుడు స్టోర్లో చెల్లింపు పూర్తి చేయడానికి గంట సేపు ఆగాల్సి ఉంటుంది. ఇలాంటి కొన్నింటికి నిబంధన విధించడం సరికాదని బ్యాంకులు చెబుతున్నాయి. దీంతో పాటు డిజిటల్ లావాదేవీలకు మరో కొత్త నిబంధనను ప్రవేశపెట్టాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. వృద్దులు డిజిటల్ లావాదేవీలు చేయాలంటే విశ్వసనీయ వ్యక్తి ఆమోదం ఉండేలా కొత్త రూల్స్ తీసుకురానుంది. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిజిటన్లకు ఈ రూల్ వర్తింపచేయనుంది. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు చేసే డిజిటల్ లావాదేవీలకు ‘విశ్వసనీయ వ్యక్తి’ ఆమోదం తప్పనిసరి చేయాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధన ప్రకారం సీనియర్ సిజిజన్లు ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేయాలంటే ఎంపిక చేసిన విశ్వసనీయ వ్యక్తి అదనపు ఆమోదం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ విశ్వసనీయ వ్యక్తి మారినట్లయితే 24 గంటల కూలింగ్ ఆఫ్ పీరియడ్ విధిస్తారు. వృద్దులకు డిజిటల్ ట్రన్సాక్షన్లపై అంతగా అవగాహన ఉండదు. దీంతో సైబర్ మోసాల గురించి తెలుసుకోకుండా నగదును బదిలీ చేసే అవకాశం ఉంటుంది. దీంతో మరో వ్యక్తి ఆమోదాన్ని తప్పనిసరి చేయనున్నారు.
0 Comments