Ad Code

ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురు మృతి

తెలంగాణలోని నల్లగొండ జిల్లా దామరచర్ల లారీ యార్డ్ వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మృతులను వాడపల్లికి చెందిన బత్తుల ధనుంజయరావు (43), ఉప్పుతల నరసింహారావు (38), దాచేపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన డెక్క వెంకటేశ్ (25)గా పోలీసులు గుర్తించారు. స్థానికంగా ఉన్న ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేసేందుకు ధనుంజయరావు, నరసింహారావు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. వారిద్దరూ దామరచర్ల లారీ యార్డ్ వద్దకు రాగానే.. బైక్‪పై వేగంగా వచ్చిన వెంకటేశ్ (25) అనే యువకుడు వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ధనుంజయరావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన నరసింహారావు, వెంకటేశ్‌ని హుటాహుటిన మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. కాగా, వెంకటేశ్ చికిత్సపొందుతూ పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. మరోవైపు మెరుగైన చికిత్స కోసం నరసింహారావును నల్లగొండకు తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. ఒకే ప్రమాదంలో ముగ్గురు మృతిచెందడంతో దామరచర్ల మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu