Ad Code

నీటి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి : రాష్ట్రాలకు ప్రధాన మంత్రి సూచన

ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలు నీటి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, రాబోయే వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. 28 రాష్ట్రాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో 'వికసిత భారత్@2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి' అనే అంశంపై చర్చ జరిగింది. ప్రపంచ వాతావరణ సంస్థ ఇప్పటికే 2026 మధ్యకాలం నుంచి ఎల్ నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎల్ నినో ప్రభావం వ్యవసాయం, నీటి వనరులు, గ్రామీణ జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా భారతదేశంలో రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం ఎక్కువగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎల్ నినో అనేది మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని సముద్ర జలాలు సాధారణం కంటే అధికంగా వేడెక్కే వాతావరణ పరిస్థితులు. దీని ప్రభావంతో భారతదేశంలో రుతుపవన వర్షాలు బలహీనపడటం, వడగాలులు పెరగడం, కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. జపాన్ వాతావరణ శాఖ సహా పలువురు అంతర్జాతీయ వాతావరణ నిపుణులు కూడా ఎల్ నినో పరిస్థితులు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని నీటి సంరక్షణ చర్యలను బలోపేతం చేయాలని రాష్ట్రాలకు సూచించారు. వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పరిరక్షణ, సాగునీటి సమర్థ వినియోగం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు సమన్వయంతో కూడిన జాతీయ కార్యాచరణ అవసరమని అన్నారు. అంతేకాకుండా దేశ ఆర్థికాభివృద్ధి, స్వావలంబన లక్ష్యాలపై కూడా ప్రధాని దృష్టి సారించారు. పునరుత్పాదక ఇంధనం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల వినియోగం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ముప్పుగా కాకుండా అవకాశంగా చూడాలని పేర్కొన్నారు. అదే సమయంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుర్వినియోగం వంటి కొత్త సవాళ్లపై రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Post a Comment

0 Comments

Close Menu