ఆంధ్రప్రదేశ్ అనంతపురంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనకు ప్రజల్లో గుర్తింపు తీసుకువచ్చింది పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియానేనని అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, ఏది నిజం అనే విషయాన్ని నిర్ధారించుకోవాలంటే ఇప్పటికీ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియానే ఆధారమని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఎంత నిజం ఉంటుందో, అంతే స్థాయిలో అసత్య ప్రచారం కూడా ఉంటుందని చెప్పారు. అందువల్ల ప్రజలకు వాస్తవాలను చేరవేయడం, తప్పుడు ప్రచారాన్ని ఖండించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు. గతంలో ప్రజా సమస్యలపై జర్నలిస్టులతో కలిసి పోరాటాలు చేశామని, అయితే గత ప్రభుత్వం జర్నలిస్టులపై, తమపై కుట్రలు చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సీనియర్ జర్నలిస్టులకు పింఛన్ కల్పించాలనే డిమాండ్తో పాటు, అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు మరియు గృహ నిర్మాణ సదుపాయాలు కల్పించాలనే అంశాలు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. ఈ సమస్యలను ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి పయ్యావుల కేశవ్ హామీ ఇచ్చారు. సమాజంపై సోషల్ మీడియా ప్రభావం అనే అంశంపై ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, అమిలినేని సురేంద్రబాబు, ఐజేయూ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమసుందర్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
0 Comments