కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణ జల హక్కులకు తీవ్ర ప్రమాదం ఏర్పడిందని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్రావు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జలాల వినియోగంలో చారిత్రక కనిష్ట స్థాయికి తెలంగాణ పడిపోయిందని, ఏపీ 74% నీటిని వినియోగిస్తే తెలంగాణ 25%కే పరిమితమైందని తెలిపారు. రైతులు, తాగునీటి అవసరాలు, పరిశ్రమల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడేసిందని విమర్శించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ఎత్తిపోతల పంపుల నిర్వహణ విషయంలో ఏప్రిల్ 7న లేఖ రూపంలో బీఆర్ఎస్ చేసిన హెచ్చరికలను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. అందువల్లే పంపులు దెబ్బతిని, కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యం చెందినట్లు ఆ లేఖలో తెలిపారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోందని, కాళేశ్వరం గాయత్రి పంపింగ్ స్టేషన్తోపాటు దేవాదుల తదితర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పంపులు, మోటార్లు దెబ్బతిన్నాయని తెలిపారు. భారీ మోటార్లను పదేపదే ఆన్-ఆఫ్ చేయడం వల్ల పరికరాలు దెబ్బతింటాయని ముందుగానే తాము హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని విమర్శించారు. వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కీలక సాగునీటి మౌలిక వసతులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నష్టపోతుండటం శోచనీయమన్నారు. ప్రాజెక్టులను బలహీనపరచి ఆ నెపాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మోపే ప్రయత్నమా అన్న అనుమానం కలుగుతోందన్నారు. అలాగే ట్రాన్స్కో సూచనలపై ఆయన ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. సోలార్ విద్యుత్ అందుబాటులో ఉండే పగటి వేళల్లోనే లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు నడపాలని ట్రాన్స్కో సూచించడం వల్ల భారీ పంపులను తరచూ స్టార్ట్, స్టాప్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, దీనివల్ల పంపులు, మోటార్లకు నష్టం వాటిల్లితే ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ నిర్ణయాలకు ముందు సాంకేతిక అధ్యయనం జరిగిందా లేదా అనేది అసలు ప్రశ్న అన్నారు. జీఓ నం.8 వల్ల కలిగే ప్రమాదం గురించి కూడా ప్రస్తావించారు. జీఓ 8 ద్వారా టీజీఆర్పీడీసీఎల్కు అధిక పునరుత్పాదక (సోలార్) విద్యుత్ కేటాయింపు జరిగిందని, సోలార్ విద్యుత్ ప్రధానంగా ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకే అందుబాటులో ఉంటుందని, దీంతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పంపింగ్ కార్యకలాపాలు పరిమిత సమయానికే కట్టుబడే ప్రమాదం ఉందని హరీష్రావు ఆందోళన వ్యక్తం చేశారు. నీటి ఎత్తిపోతలు తగ్గి కృష్ణా-గోదావరి జలాల వినియోగ సామర్థ్యం దెబ్బతింటుందన్నారు. రాష్ట్ర జల హక్కులకు ముప్పు గురించి ప్రస్తావిస్తూ కాళేశ్వరం, దేవాదుల, పాలమూరు ఇతర ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యం రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా, గోదావరి జలాలను పూర్తిగా వినియోగించుకోవడం.. అయితే విద్యుత్ లభ్యత ఆధారంగా పంపింగ్ను పరిమితం చేయడం రాష్ట్ర జల హక్కులకు విరుద్ధం అని అన్నారు. నీటి వినియోగం తగ్గితే వ్యవసాయం, తాగునీరు, భూగర్భ జలాలు, చేపల పెంపకం, పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి, గ్రామీణ జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో కృష్ణా జలాల వినియోగం కనిష్ఠ స్థాయికి పడిపోవడం శోచనీయమన్నారు. తెలంగాణకు కేటాయించిన తాత్కాలిక వాటా 34% కాగా ఆంధ్రప్రదేశ్కు 66%గా ఉందని, 2024-25లో ఏపీ 72.73% నీటిని వినియోగించగా, తెలంగాణ కేవలం 27.27% వినియోగించిందని, 2025-26లో ఏపీ వినియోగం 74.90%కి పెరగగా తెలంగాణ వినియోగం చారిత్రక కనిష్ఠమైన 25.10%కి పడిపోయిందని తెలిపారు. నీటి లభ్యత అధికంగా ఉన్నప్పటికీ రాష్ట్రా తన వాటా నీటిని కూడా పూర్తిగా వినియోగించుకోలేకపోయిందని ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. రాష్ట్ర జల హక్కులను, రైతుల ప్రయోజనాలను కాపాడడంలో ప్రభుత్వ వైఫల్యానికి ఇది మరో నిదర్శనమని అన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పంపింగ్ సీజన్లో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందని హరీష్రావు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా, గోదావరి జలాల పూర్తి వినియోగం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని, రైతు డిస్కం ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం, దేవాదుల తదితర ప్రాజెక్టుల నిర్వహణ, ఆధునీకరణకు తగిన బడ్జెట్ కేటాయించాలని, వ్యవసాయం, తాగునీరు, పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి తదితర రంగాలకు తగిన నీటి లభ్యతను నిర్ధారించాలనేవి కూడా డిమాండ్లలో ప్రధానమైనవన్నారు.
0 Comments