Ad Code

అరుణాచల్ ప్రదేశ్‌లో బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు : పూర్తిగా స్తంభించిపోయిన రవాణా వ్యవస్థ

రుణాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు జిల్లాలు వరద గుప్పిట్లో చిక్కుకోగా, ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. కొండ ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడుతుండటంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. కొండల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీరు లోతట్టు ప్రాంతాల్లోని గ్రామాలను ముంచెత్తడంతో వేలాది మంది ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరడంతో పాటు కొండచరియలు విరిగిపడటంతో అనేక జిల్లాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, స్థానిక పరిపాలనా యంత్రాంగం రంగంలోకి దిగాయి. వరదల్లో చిక్కుకున్న వృద్ధులు, మహిళలు, పిల్లలను రెస్క్యూ బోట్ల సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకువస్తున్నారు. బాధితుల కోసం ప్రభుత్వం పలు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, వారికి అవసరమైన ఆహారం, మందులను అందిస్తోంది. రాబోయే మరికొన్ని రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో.. నదీ పరివాహక ప్రాంతాలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ ప్రయాణాలు చేయవద్దని, సహాయం కోసం నియమించిన కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

Post a Comment

0 Comments

Close Menu