Ad Code

గత వారం రూ.88,678 కోట్లు పెరిగిన స్టాక్ మార్కెట్‌ సంపద

గత వారం కేవలం నాలుగు రోజులే ట్రేడింగ్ జరిగినప్పటికీ దలాల్ స్ట్రీట్ బుల్ రన్‌తో దూసుకుపోయింది. దేశంలోని టాప్ 10 అత్యంత విలువైన కంపెనీలలో ఆరు కంపెనీలు ఇన్వెస్టర్లపై కనక వర్షం కురిపించాయి. నాలుగు రోజుల్లో ఆరు దిగ్గజ సంస్థల ఉమ్మడి మార్కెట్ విలువ ఏకంగా రూ.88,678 కోట్లు పెరిగింది. గత వారం నడిచిన మార్కెట్ ర్యాలీకి బ్యాంకింగ్ స్టాక్స్ పూర్తిగా నాయకత్వం వహించాయి. ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్ ఇన్వెస్టర్లకు బంపర్ లాభాలను తెచ్చిపెట్టి అగ్రగామిగా నిలిచింది. ఈ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.29,588.75 కోట్లు పెరిగి, మొత్తం విలువ రూ.9,95,610.74 కోట్లకు చేరింది. 10 లక్షల కోట్ల మార్కుకు ఇది అత్యంత చేరువలో ఉంది. దీని తర్వాత ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలువ రూ.24,718.30 కోట్లు పెరగ్గా.. ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాప్ రూ.9,322.93 కోట్లు వృద్ధి చెంది రూ.9,64,738 కోట్లకు చేరింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్లో తన తిరుగులేని ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. గత వారంలో ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.12,043.96 కోట్లు పెరిగింది. దీంతో రిలయన్స్ మొత్తం మార్కెట్ క్యాప్ రూ.17,83,926.92 కోట్లకు చేరి, దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా టాప్‌లో కొనసాగుతోంది. వీటితో పాటు బజాజ్ ఫైనాన్స్ రూ.11,580.28 కోట్లు, లార్సెన్ & టూబ్రో రూ.1,423.88 కోట్ల లాభాలను ఖాతాలో వేసుకున్నాయి. మార్కెట్ ఇంతలా లాభపడుతున్నా కొన్ని దిగ్గజ కంపెనీలు మాత్రం తీవ్ర ఎదురుదెబ్బలు తిన్నాయి. టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ అత్యధికంగా రూ.35,615.21 కోట్లు నష్టపోయింది. అలాగే ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ విలువ రూ.21,188.74 కోట్లు పడిపోయింది. ఐటీ దిగ్గజం టీసీఎస్ రూ.11,143.71 కోట్లు, ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ రూ.5,321.83 కోట్లు నష్టపోయాయి. గత వారం బీఎస్ఈ సెన్సెక్స్ 297.57 పాయింట్లు (0.38%), ఎన్ఎస్ఈ నిఫ్టీ 42.90 పాయింట్లు (0.17%) లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం భారత మార్కెట్‌కు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu