దేశంలో వినికిడి లోపం సమస్య చాలా వేగంగా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం భారత దేశంలో దాదాపు 6.3 కోట్ల మందికి పైగా తీవ్రమైన వినికిడి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా చాలామంది గంటల తరబడి హెడ్ఫోన్లు, ఇయర్ఫోన్లు వాడుతున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువ వాల్యూమ్ పెట్టి పాటలు వినడం, సినిమాలు చూడడం లేదా గేమ్లు ఆడడం చేస్తున్నారు. ఇక ఈ అలవాటు వల్ల చెవిలోని సున్నితమైన నరాలు దెబ్బతిని, చిన్న వయసులోనే వినికిడి శక్తి తగ్గిపోతోంది. పెరుగుతున్న శబ్ద కాలుష్యం: నగరాల్లో ట్రాఫిక్ హోరు, ఫ్యాక్టరీల శబ్దాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వీటికి తోడు పెళ్లిళ్లు, పండుగల్లో డిజేలు, పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టడం సర్వసాధారణం అయిపోయింది.ఇక ఇలాంటి అత్యధిక శబ్దాల మధ్య నిరంతరం ఉండటం వల్ల కూడా వినికిడి సామర్థ్యం క్రమంగా క్షీణిస్తుంది. దేశంలో వృద్ధుల జనాభా పెరుగుతోంది. వయసు పైబడే కొద్దీ సహజంగానే వినికిడి శక్తి తగ్గడం ఒక కారణం. అలాగే చిన్న పిల్లల్లో వచ్చే చెవి ఇన్ఫెక్షన్లను సకాలంలో గుర్తించి డాక్టర్కు చూపించకపోవడం జన్యుపరమైన లోపాలు కూడా వినికిడి లోపానికి దారితీస్తున్నాయి. వినికిడి సమస్య రాకుండా ఉండాలంటే 60/60 రూల్ పాటించాలి. అంటే ఇయర్ఫోన్లు వాడేటప్పుడు వాల్యూమ్ 60 శాతం కంటే తక్కువ ఉంచుకోవాలి, అలాగే 60 నిమిషాల కంటే ఎక్కువ సేపు వాడకూడదు. ఇక శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉన్న చోట ఇయర్ ప్లగ్స్ వాడటం, చెవిలో ఇన్ఫెక్షన్లు వస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించడం చాలా ముఖ్యం. కళ్లు ఎంత ముఖ్యమో, చెవులు కూడా అంతే ముఖ్యం. నిర్లక్ష్యం వల్ల వచ్చే వినికిడి లోపాన్ని మన చేతులారా కొనితెచ్చుకోకూడదు. అధిక శబ్దాలకు దూరంగా ఉంటూ, ఇయర్ఫోన్ల వాడకాన్ని తగ్గిస్తే మన వినికిడి శక్తిని సురక్షితంగా కాపాడుకోవచ్చు.
0 Comments