రెండు బస్సులు ఢీకొని ఏడుగురు మృతి : 20 మందికి తీవ్రగాయాలు


గుజరాత్‌లోని సూరత్ జిల్లా బార్డోలి పరిధిలోని ఉవా గ్రామం వద్ద మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రెండు బస్సులు హైవేపై బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద తీవ్రతకు ఒక బస్సు నియంత్రణ కోల్పోయి, డివైడర్‌ను దాటి అవతలి వైపు రోడ్డుపైకి దూసుకెళ్లి ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. ఈ దుర్ఘటనలో కనీసం ఏడుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో ఎక్కువ మంది మహారాష్ట్రకు చెందినవారేనని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మంగళవారం సాయంత్రం 4 గంటల తర్వాత ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది, పోలీసులు, స్థానిక ప్రజలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపు చేస్తూనే బస్సుల్లో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించి, గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది. బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోగా, క్షతగాత్రులు రోడ్డు పక్కన సహాయం కోసం నిరీక్షిస్తున్న దృశ్యాలు కలచివేశాయి. సూరత్ రూరల్ ఎస్పీ రాజేష్ గధ్వి, రేంజ్ ఐజీ ప్రేమ్‌వీర్ సింగ్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రథమ ప్రాధాన్యమని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం