బెంగాల్ రాష్ట్రంలోకి అక్రమంగా వలస వచ్చినవారు తమంత తాముగా గౌరవప్రదంగా వెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారి హెచ్చరించారు. దీనితో నిన్నటి నుంచి బెంగాల్ రాష్ట్రం నుంచి బంగ్లాదేశ్ రాష్ట్రానికి పెద్దఎత్తున వలస ప్రజలు వెళ్లిపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాష్ట్రంలో అక్రమంగా నివసించే వలసదారులు స్వచ్ఛందంగా తమతమ స్వప్రాంతాలకు వెళ్లిపోవాలని సువేందు సూచించారు. లేదంటే తామే బలవంతంగా వెళ్లగొట్టాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా, బంగ్లా ప్రజలు స్వచ్ఛందంగా వెళ్లకపోతే.. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతమున్న విదేశీయుల చట్టానికి లోబడే తాము ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. భారత్ నుంచి తమ పౌరులను తిరిగి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు బంగ్లాదేశ్ ఇప్పటికే చెప్పిందని.. వారిని తిరిగి తీసుకువెళ్లడం అక్కడి ప్రభుత్వ బాధ్యత అని సువేందు పేర్కొన్నారు. చొరబాటుదారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని జైల్లో పెట్టొద్దని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. వారికి ఆశ్రయమిచ్చి, తిండి పెట్టడానికి వారేమైనా మన బంధువులా అని ప్రశ్నించారు. బెంగాల్ ప్రభుత్వం 'గుర్తించండి, తొలగించండి, బహిష్కరించండి' అనే నినాదంతో విదేశీయులను దేశం నుంచి పంపేయడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే అక్రమంగా రాష్ట్రంలోకి చొరబడినట్లు గుర్తించిన వారికి, సరైన పత్రాలు లేని వారికి తాత్కాలికంగా ఆశ్రయం కల్పించడానికి నిర్బంధ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. మాల్దాలో తొలి నిర్బంధ కేంద్రాన్ని ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. త్వరలో మరిన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అక్రమంగా రాష్ట్రంలోకి వలస వచ్చిన వారిపై బెంగాల్ ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేయడంతో బంగ్లాదేశీయులు తమ స్వదేశానికి పయనమవుతున్నారు. మంగళవారం ఉదయం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హకీంపుర్ సరిహద్దు ప్రాంతంలో పదుల సంఖ్యలో బంగ్లాదేశీయులు గుమిగూడినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో 'సర్' ప్రక్రియ చేపట్టిన సమయంలో కూడా ఈ సరిహద్దు నుంచి వేల సంఖ్యలో బంగ్లాదేశ్కు వెళ్లినట్లు తెలిపారు.
0 Comments