ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేసిన మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు చిత్రపటానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. భాస్కరరావు చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. రాష్ట్ర మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పితృవియోగంతో బాధపడుతున్న మనోహర్ గారిని, వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన జనసేనాని, ఈ కష్టసమయంలో తాను , పార్టీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నాదెండ్ల భాస్కరరావు గారికి మనోహర్ తో ఉన్న అనుబంధాన్ని, తండ్రిగా ఆయన అందించిన మార్గదర్శకత్వాన్ని ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకున్నారు. నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేయగా, పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి పరామర్శించడం నాదెండ్ల కుటుంబం పట్ల ఆయనకున్న గౌరవాన్ని చాటిచెప్పింది. రాజకీయ విలువలతో కూడిన ప్రస్థానాన్ని కొనసాగించిన భాస్కరరావు గారి స్మృతిలో కొద్దిసేపు మౌనం పాటించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని నేతలు ప్రార్థించారు.
0 Comments