హైదరాబాద్ లోని సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానంతో భర్త తన భార్యను హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఒడిశాలోని జాజ్పూర్ జిల్లా వాసులైన చంద్ర బాను సమల్ (39), సస్మిత సమల్ (34) దంపతులు. వీరికి చందన్ (12), చాందిని (9) ఇద్దరు పిల్లలు. దాదాపు ఏడాది కాలం నుంచి వీరు ఫతేనగర్లోని శివశంకర్ కాలనీలో నివసిస్తున్నారు. ఈ నెల 5న రాత్రి సుమారు 8 గంటల సమయంలో భార్య సస్మిత సమల్ ఇతరులతో ఫోన్లో మాట్లాడుతున్నారని అనుమానించిన భర్త చంద్ర బాను కోపోద్రిక్తుడై ఆమె పై దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో ఉన్న డంబెల్తో ఆమె తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావం జరిగి ఆమె స్పృహ కోల్పోయింది. తక్షణమే ఆమెను సమీపంలోని బీబీఆర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై సనత్నగర్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
0 Comments