బెంగళూరు – ముంబై నగరాల మధ్య నూతన సూపర్ఫాస్ట్ రైలు సర్వీస్ జూన్ నెలలో ప్రారంభం కానుంది. గత ఏడాది ఈ రెండు నగరాల మధ్య రెండవ ప్రత్యక్ష సూపర్ఫాస్ట్ రైలుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ‘ఉద్యాన్ ఎక్స్ప్రెస్’ తర్వాత ఈ మార్గంలో మంజూరైన రెండో రైలు ఇదే కావడం విశేషం. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ వచ్చే నెలలో ఈ రైలు పట్టాలెక్కనుందని తెలిపారు. ఈ రైలు తుమకూరు, దావణగెరె, హవేరి, హుబ్బల్లి-ధార్వాడ్, బెలగావి మీదుగా ప్రయాణిస్తుందని మంత్రి పేర్కొన్నారు. మధ్య కర్ణాటక మీదుగా ముంబై వాణిజ్య నగరానికి వెళ్లేందుకు వీలుగా, జూన్ చివరి నాటికి బెంగళూరు-ముంబై సూపర్ఫాస్ట్ రైలును ప్రారంభించనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ నూతన సర్వీస్ ద్వారా ఈ మార్గంలో ప్రయాణించే లక్షలాది మందికి లబ్ధి చేకూరడమే కాకుండా, వాణిజ్యం, వ్యాపార రంగాలకు మరింత ఊతం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రారంభించనున్న సూపర్ఫాస్ట్ రైలును భవిష్యత్తులో వందే భారత్ స్లీపర్ సర్వీస్గా మార్చాలన్న తన అభ్యర్థనకు రైల్వే మంత్రి అంగీకరించారని జోషి తెలిపారు. ఈ సెమీ హై-స్పీడ్ రైలు సుదూర ప్రయాణాల్లో ప్రయాణికులకు అత్యున్నత స్థాయి సౌకర్యాలను అందించడమే కాకుండా, రాత్రి ప్రయాణ అనుభవాన్ని సరికొత్తగా మార్చనుంది. చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ సాంకేతికతతో బెంగళూరులోని బీఈఎంఎల్ అభివృద్ధి చేసిన ఈ సరికొత్త ఆరెంజ్, గ్రే రంగు రైలు, కెఎస్ఆర్ బెంగళూరు- ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మధ్య నడవనుంది.
0 Comments