భారతీయ జనతా పార్టీ నాలుగు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించింది. ఇటీవలే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ మార్పులు చోటు చేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. పంజాబ్, త్రిపుర, హర్యానా, ఢిల్లీలకు బీజేపీ నూతన అధ్యక్షులు నియమితులయ్యారు. పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిగా సర్దార్ కేవల్ సింగ్ ధిల్లాన్ అపాయింట్ అయ్యారు. ఈశాన్యాన ఉన్న త్రిపురలో పార్టీ పగ్గాలు అభిషేక్ దేబ్రాయ్ చేతికి చిక్కాయి. ఆయన పార్టీ రాష్ట్రశాఖ చీఫ్ గా నియమితులయ్యారు. హర్యానా బీజేపీ అధ్యక్షురాలిగా డాక్టర్ అర్చనా గుప్తా నియమితులు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశ రాజధానిలో పార్టీ రాష్ట్రశాఖ బాధ్యతలను హర్ష్ మల్హోత్రాకు అప్పగించారు. పంజాబ్ కొత్త అధ్యక్షుడు కేవల్ సింగ్ ధిల్లాన్ బర్నాలా నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2022 సంగ్రూర్ లోక్సభ, 2024లో బర్నాలా అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఆయన బీజేపీ తరపున పోటీ చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త కూడా. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్కు అత్యంత సన్నిహితుడు. బర్నాలా ప్రజలు ఆయన్ను 'వికాస్ పురుష్'గా గౌరవిస్తారు. తన రాజకీయ ప్రస్థానంలో అభివృద్ధి అంశాలకే ప్రాధాన్యతనిచ్చిన ధిల్లాన్ కు వివాదరహితుడిగా పేరుంది. ఢిల్లీ బీజేపీ నూతన అధ్యక్షుడు హర్ష్ మల్హోత్రా పార్టీలో సీనియర్ నాయకుడు. ఢిల్లీ నుండి లోక్సభ ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన, సుదీర్ఘకాలం సంస్థాగత రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ, ప్రజా సంబంధాలు, వ్యవస్థాపర సామర్థ్యాన్ని పెంపొందించడంలో గుర్తింపు పొందారు.
0 Comments