చైనాలో అవినీతికి పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో ఆ దేశ రక్షణ శాఖ మాజీ మంత్రులకు ఆ దేశ మిలిటరీ కోర్టు ఉరిశిక్ష విధించింది. అవినీతి వ్యవహారంలో వీ ఫెంగే, లీ షాంగ్లపై ఈ మేరకు చర్యలు తీసుకుంది. లంచాలు స్వీకరించిన కేసులో ఫెంగే, లంచాలు తీసుకోవడంతోపాటు ఇవ్వజూపిన కేసులో షాంగ్ దోషిగా తేలారు. అయితే ఈ శిక్ష అమలును కోర్టు రెండేళ్లపాటు నిలిపివేసినట్లు అధికారిక మీడియా వెల్లడించింది. ఫెంగే.. 2018-23 మధ్యకాలంలో చైనా రక్షణశాఖ మంత్రిగా పనిచేశారు. అంతకుముందు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన అత్యంత కీలకమైన రాకెట్ ఫోర్స్కు అధిపతిగా ఉన్నారు. ఆయన అనంతరం రక్షణశాఖ మంత్రిగా లీ షాంగ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవికి ఆయన్ను స్వయంగా జిన్పింగే ఎంపిక చేశారు. కానీ, ఏడాది తిరగకముందే తొలగించారు. అనంతరం షాంగ్ కొన్ని నెలలపాటు కనిపించకుండా పోయారు. 2024లోనే అధికార కమ్యూనిస్టు పార్టీ నుంచి ఈ ఇద్దరినీ బహిష్కరించారు. చైనా అధ్యక్షుడిగా జిన్పింగ్ అధికారంలోకి వచ్చిన అనంతరం పాలక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా భారీ అవినీతి నిరోధక ఉద్యమం చేపట్టింది.
0 Comments