ఇండియా కూటమి భేటీ జూన్‌ మొదటి వారంలోనే జరిగే అవకాశాలున్నాయని టీఎంసీ చీఫ్‌ మమతా బెనర్జీ చెప్పారు. ఈ భేటీలో ఉమ్మడి వ్యూహాన్ని చర్చిస్తామని చెప్పారు. అధికార బీజేపీతో సుదీర్ఘ రాజకీయ పోరాటానికి తమ కూటమి సిద్ధంగా ఉందని ఆమె ప్రకటించారు. ఈ సందర్భంగా ఇటీవలి బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో భారీ అవకతవకలకు బీజేపీ పాల్పడిందన్నారు. కనీసం 150 నియోజకవర్గాల్లో టీఎంసీకి దక్కాల్సిన ఓట్లను తారుమారు చేశారని ఆరోపించారు. ఓడిపోయే సీట్లను గెల్చుకుని, గెలవాల్సిన చోట్ల ఓడిపోయామన్నారు. లేకుంటే టీఎంసీకి 220 నుంచి 230 సీట్లు దక్కి ఉండేవని చెప్పారు. మమత వాదనను బీజేపీ నాయకురాలు కీయా ఘోష్‌ ఖండించారు. ప్రజల తీర్పును అంగీకరించేందుకు నిరాకరిస్తున్న మమతా బెనర్జీ, బదులుగా కుట్ర సిద్ధాంతాలతో ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు. 2011, 2016, 2021 ఎన్నికల ఫలితాలను చట్టబద్ధమైనవిగా అంగీకరించి, ఇప్పుడెందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారంటూ మమతను నిలదీశారు. మమత దృష్టిలో గెలుపంటే.. బూత్‌లను ఆక్రమించుకోవడం, రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడటం, హింసను ప్రేరేపించడమేనని ఆమె వ్యాఖ్యానించారు.

Post a Comment

Previous Post Next Post