Ad Code

మోడీ ప్రభుత్వం జ్ఞానేష్​తో ఎన్నికలను నిర్వహిస్తుంది !


దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పెట్టుబడుల క్షీణత, సరఫరా గొలుసు లోపాలను సరిగ్గా నిర్వహించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేష్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. ప్రధాని మోడీ ఇటలీ పర్యటన సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ‘మెలోడీ’ టాఫీ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఘాటు విమర్శలు చేశారు. దేశ ప్రధానమంత్రి టోఫీలు పంచే పనిలో, ప్రజలకు నీతిబోధలు చేయడంలో బిజీగా ఉన్నారని, కానీ దేశ ఆర్థిక వ్యవస్థను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం ‘జ్ఞానేశ్​తో ఎన్నికలను నిర్వహిస్తోందని’, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఆర్థిక వ్యవస్థపై ‘కొత్త జ్ఞానం’ అవసరమని ఎద్దేవా చేశారు. దేశంలో ప్రైవేట్ పెట్టుబడులు స్తంభించిపోవడంపై కాంగ్రెస్ నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తోందని జైరాం రమేష్ పేర్కొన్నారు. ఆయన తన ప్రకటనలో ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు. దేశంలో వాస్తవ వేతనాలు పెరగకపోవడం వల్ల అన్ని ఆదాయ వర్గాల్లో వినియోగ వృద్ధి పడిపోయింది. మార్కెట్‌లో డిమాండ్ లేనప్పుడు ప్రైవేట్ కంపెనీలు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపడం లేదు. కార్పొరేట్ ఇండియాకు పన్ను రేట్లు రికార్డు స్థాయిలో తక్కువగా ఉన్నాయని, వారి ఆదాయాలు మరియు స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్లు రికార్డు స్థాయిలో పెరుగుతున్నా, అవి క్షేత్రస్థాయి ఉపాధికి ఉపయోగపడటం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానపరమైన మార్పులు, దర్యాప్తు సంస్థల వేధింపుల కారణంగా దేశీయ వ్యాపారవేత్తలు భయాందోళనల మధ్య ఉన్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రధానికి అత్యంత సన్నిహితులుగా ఉన్నవారే ప్రభుత్వ అండతో పెద్ద పెద్ద కంపెనీలను టేకోవర్ చేస్తున్నారని, దీనివల్ల సంపద అంతా ఒకే చోట కేంద్రీకృతం అవుతోందని విమర్శించింది. ఈ క్రమంలో ‘మోదానీ’ బంధుప్రీతి ఇందుకు ఒక అద్భుతమైన ఉదాహరణ అని జైరాం రమేష్ దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే ఆర్థిక నిపుణులు సైతం ఇప్పుడు బహిరంగంగా దేశ ఆర్థిక స్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన గుర్తుచేశారు.

Post a Comment

0 Comments

Close Menu