Ad Code

రేణు దేశాయ్‌ని అసభ్యకర పదజాలంతో దూషించిన కేసు : ఆరుగురిని అరెస్ట్‌ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు


సినీ నటి రేణు దేశాయ్‌ని అసభ్యకర పదజాలంతో దూషించిన ఆరుగురిని హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె ఒక వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కొద్దిరోజుల క్రితం ఒక మీడియా సమావేశంలో వీధి శునకాల రక్షణ గురించి ఆమె మాట్లాడిన విషయం తెలిసిందే. వంద కుక్కల్లో 10 పిచ్చివి ఉంటాయని, వాటితో జాగ్రత్తగా ఉండాలని ఆమె చెప్పారు. ఆ పదింటి కోసం మిగిలిన 90 కుక్కల్ని చంపకూడదని ఆమె అన్నారు. దీంతో ఆమెపై కొందరు నెటిజన్లు బూతులతో రెచ్చిపోయారు. సోషల్‌మీడియా వేదికగా ఫేక్‌ అకౌంట్‌లు క్రియేట్‌ చేసుకుని నిత్యం అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని రేణూ దేశాయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెడు కామెంట్లు చేసే వారిని వాళ్ల అమ్మానాన్నల ముందు నిలబెడతానని హెచ్చరించారు. ఆమె చెప్పినట్లుగానే ఫిర్యాదు చేయడంతో తాజాగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె ఒక వీడియో చేశారు. 'పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. త్వరలో మరికొందరిని అరెస్ట్‌ చేస్తారు. ఎవరూ తప్పించుకోలేరు. మీ తల్లిదండ్రులకు సమాచారం ఇస్తారు. మీరు ఉద్యోగం చేస్తుంటూ ఆఫీస్‌లో తెలుపుతారు. ఎవరినీ బూతులతో తిట్టకండి.' అంటూ కోరారు. రేణు దేశాయ్‌ని ఎందుకు తిట్టారని వారిని పోలీసులు ప్రశ్నాంచారు. ఆమె వల్ల మీకేమి కష్టం జరగలేదు కదా అని అడిగితే.. ఆమె ఒక సెలబ్రిటీ కాబట్టి తాము తిట్టామని అలా కాస్త ఫేమస్ కావచ్చని అనుకున్నట్లు వివరణ ఇచ్చారు.

Post a Comment

0 Comments

Close Menu