పశ్చిమ బెంగాల్ లో అల్లర్లకు పాల్పడే వారు ఎవరైనా సరే వదిలిపెట్టవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే శక్తులపై ఉక్కుపాదం మోపాలని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఉన్నతాధికారులను ఆదేశించారు. పరిస్థితిని సమీక్షించిన సీఈసీ, రాష్ట్రంలోని కీలక అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కోల్కతా పోలీస్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో ఉండి నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పెట్రోలింగ్ను ముమ్మరం చేయాలని, ప్రజల్లో భరోసా కల్పించాలని ఆదేశించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు సుమారు 700 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలు రాష్ట్రంలోనే కొనసాగుతాయని స్పష్టం చేశారు. సీఏపీఎఫ్ డీజీలు స్వయంగా బందోబస్తును పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఈసీ అభిప్రాయపడింది. నిందితులపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా కేసులు నమోదు చేయాలని పోలీసు యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసినా, రాష్ట్రంలో సాధారణ పరిస్థితి నెలకొనే వరకు కేంద్ర బలగాలు అక్కడే ఉండి శాంతిని పునరుద్ధరించనున్నాయి.
0 Comments