హైదరాబాద్కు చెందిన ఒక వ్యాపారవేత్తను మోసం చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అషు రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆమె ఈ కేసులో విచారణను ఎదుర్కోవాల్సి ఉంది. సుమారు రూ. 9.35 కోట్ల మేర ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలు జరిగాయని, అందులో అషు రెడ్డి పాత్ర ఉందంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు, విచారణ నిమిత్తం సోమవారం తమ ముందు హాజరు కావాలని అషు రెడ్డికి 41A సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. తనపై నమోదైన ఈ కేసు అక్రమమని, దీనిని కొట్టివేయాలని కోరుతూ అషు రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఆమె దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది. చట్టప్రకారం దర్యాప్తు జరగాల్సిందేనని, పోలీసుల విచారణకు సహకరించాలని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆమెకు న్యాయపరంగా ఉన్న ఒక దారి మూసుకుపోయినట్లయింది. ప్రస్తుతానికి అషు రెడ్డి ఈ నోటీసులపై అధికారికంగా స్పందించలేదు. అయితే సోమవారం ఆమె విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలోనూ ఆమె పేరు కొన్ని వివాదాల్లో వినిపించినప్పటికీ, ఈసారి ఏకంగా కోట్లాది రూపాయల ఆర్థిక మోసం కేసు కావడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పోలీసు విచారణలో ఆమెకు ఈ మోసంతో ఎంతవరకు సంబంధం ఉందనే విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. హైకోర్టు కూడా పిటిషన్ను తిరస్కరించడంతో ఆమె ఖచ్చితంగా పోలీసుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
0 Comments