బెంగళూరు శివార్లలోని దేవనహళ్లిలో ఉన్న ఫాక్స్కాన్ ఐఫోన్ తయారీ ప్లాంట్ వద్ద పరువు పోతుందన్న భయంతో ఓ 19 ఏళ్ల యువతి తాను కన్న బిడ్డను పుట్టిన కొద్ది నిమిషాల్లోనే కడతేర్చింది. ఫ్యాక్టరీలో పని చేస్తున్న రేణుక (19) అనే యువతికి బుధవారం విధి నిర్వహణలో ఉండగా పురిటి నొప్పులు వచ్చాయి. ఎవరికీ చెప్పకుండా వాష్రూమ్కు వెళ్లిన ఆమె అక్కడే మగ బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి కాకుండానే తల్లి అయ్యానని, సమాజం తనను తప్పుబడుతుందని భావించిన ఆమె, తన వెంట తెచ్చుకున్న పదునైన వస్తువుతో పసికందు గొంతు కోసి చంపేసింది. అనంతరం మృతదేహాన్ని బ్యాగులో కుక్కి అక్కడే వదిలేసింది. మరో మహిళా ఉద్యోగి వాష్రూమ్లోకి వెళ్లినప్పుడు రక్తసిక్తమైన శిశువు మృతదేహాన్ని చూసి కేకలు వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ మరియు ఆ సమయంలో వాష్రూమ్కు వెళ్లిన వారి వివరాలను సేకరించి రేణుకను నిందితురాలిగా గుర్తించారు. ప్రసవం తర్వాత తీవ్ర రక్తస్రావం కావడంతో రేణుక అనారోగ్యం పాలైంది. ప్రస్తుతం ఆమెను ఆసుపత్రికి తరలించి పోలీసుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.శిశువు మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించగా, బిడ్డ పుట్టిన తర్వాతే గొంతు కోసి హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు యువతిపై హత్య కేసు నమోదు చేశారు.
0 Comments