కాల్పుల విరమణకు సంబంధించి ఇరాన్ ప్రతిపాదించిన పది డిమాండ్లలో హర్మూజ్ జల సంధిలో ట్యాంకర్లకు టోల్ ఫీజు కూడా ఒకటి. హర్మూజ్ నుంచి నౌకలు వెళ్లాలంటే ఇరాన్, ఒమన్లకు టోల్ రుసుం వసూలు చేసే అధికార ఉండాలని ఒక నిబంధనను చేర్చింది. అయితే, ఇరాన్ డిమాండ్తో ఒమన్ విబేధించింది. ఒమన్ రవాణా శాఖ మంత్రి ప్రకారం హర్మూజ్ జలసంధిలో ప్రయాణించే నౌకలపై ఎలాంటి రుసుములు విధించబోమనే హామీ ఇచ్చే ఒప్పందాలపై సుల్తాన్ సంతకాలు చేసింది. ఈ వ్యూహాత్మక కీలక ప్రదేశంలో స్వేచ్ఛాయుత, సురక్షితమైన నౌకాయానాన్ని నిర్ధారించడానికి ఒమన్ కట్టుబడి ఉందని మంత్రి నొక్కి చెప్పారు. ఇరాన్, ఒమన్ మధ్య మొత్తం 34 కిలోమీటర్ల వెడల్పు ఉండే ఈ వ్యూహాత్మక జల సంధిని అంతర్జాతీయ జలాలుగా పరిగణిస్తారు. గతంలో ఎప్పుడూ హర్మూజ్లో టోల్ ఫీజు వసూలుచేసిన సందర్భాలు లేవు. పర్షియన్ గల్ఫ్లో కీలకమైన ఈ జలమార్గం ద్వారా ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం జరుగుతుంది. అమెరికా- ఇజ్రాయెల్తో జరిగిన సంఘర్షణ దేశ రక్షణ, పరిపాలన, పౌర మౌలిక సదుపాయాలకు విస్తృత విధ్వంసం కలిగించిందని, నౌకల ద్వారా సేకరించిన డబ్బును యుద్ధానంతర పునర్నిర్మాణం కోసం వినియోగిస్తామని ఇరాన్ పేర్కొంది. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన దాడులతో పశ్చిమాసియాలో యుద్దం ప్రారంభమైంది. తాము తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించబోమని, యుద్ధానికి శాశ్వత ముగింపు పలకాలని ఇరాన్ పట్టుబడుతోంది. అలాగే, హర్మూజ్లో నౌకల నుంచి టోల్ ఫీజు వసూలు చేసే నియంత్రణ తమకు ఉండాలని డిమాండ్ చేశారు. ఈ ఫీజు నౌక రకం, దానిలోని సరుకు, పేర్కొనని ఇతర ప్రస్తుత పరిస్థితులను బట్టి మారుతుందని ఇరాన్ అధికారి ఒకరు చెప్పారు. ఇరాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కాజెమ్ గరీబాబ్ది గత వారం మాట్లాడుతూ.. హర్మూజ్ గుండా వెళ్లే నౌకలు అనుమతులు, లైసెన్సులు పొందడాన్ని తప్పనిసరి చేస్తూ ఒమన్తో ఒక ప్రోటోకాల్ను తాము రూపొందిస్తామని, ఈ చర్య రవాణాను పరిమితం చేయడానికి కాకుండా సులభతరం చేయడానికి ఉద్దేశించిందని అన్నారు. ఆ సమయంలో సులభతర రవాణాను నిర్ధారించే మార్గాలపై ఇరాన్తో చర్చలు జరిపినట్లు ఒమన్ తెలిపింది.
0 Comments