తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడిని మాజీ మంత్రి, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడి అని ఆరోపించారు. పట్టపగలు అధికార మదంతో విర్రవీగుతూ సోయి మరచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరు బీహార్ గ్యాంగ్ను తలపిస్తోందని అన్నారు. ఏకంగా ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాల పైనే ముప్పేట దాడులు చేస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా ? లేనట్లా? కాంగ్రెస్ పాలనలో ప్రజా ప్రతినిధులపై, ప్రజా సంఘాలపై, మీడియాపై దాడులు నిత్యకృత్యం కావడం సిగ్గుచేటన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిపోయారా? ఎందుకు అడ్డుకోవడం లేదు ప్రశ్నించారు. ఒకవైపు హేట్ స్పీచ్ బిల్ పేరుతో ప్రజలు, ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తూ మరోవైపు కాంగ్రెస్ గూండాలతో దాడులు చేయించడమేనా మీ ప్రజా పాలన.. ఇందిరమ్మ రాజ్యం అని చెబుతూ గూండా రాజ్యం అమలు చేస్తారా.. సీఎం, మంత్రులు ఇతర రాష్ట్రాల్లో పొలిటికల్ టూర్లు చేస్తూ పాలనను గాలికి వదిలేశారా అని నిలదీశారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఉంటే ఇక్కడ పాలనను ఎవరు చూస్తారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు చేయాలని సందేశాలు ఇచ్చారా, కాంగ్రెస్ నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా, ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని డబ్బా కొట్టి ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.. ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నారు అని ఎద్దేవా చేశారు. మీ అణచివేతలకు, మీ నిర్బంధాలకు, మీ దాడులకు బిఆర్ఎస్ పార్టీ అదరదు బెదరదు అని స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటాం, ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటాం.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడులు జరిపిన కాంగ్రెస్ గూండాలను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని రాష్ట్ర డీజీపీని డిమాండ్ చేస్తున్నామన్నారు .ఇలాంటి దాడులు ఆపకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుంది.. తస్మాత్ జాగ్రత్త అని హరీశ్ హెచ్చరించారు.
0 Comments