ఫ్లిప్కార్ట్ గ్రూపునకు చెందిన 'మింత్రా' సీఈఓగా ఉన్న నందితా సిన్హా తన పదవి నుండి తప్పుకోనున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. రాబోయే కొద్ది వారాల్లోనే ఆమె తప్పుకునే అవకాశం ఉండగా, ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ ఫ్యాషన్ విభాగానికి నాయకత్వం వహిస్తున్న షారోన్ పైస్ ఈ బాధ్యతలను చేపట్టే అవకాశం ఉంది. ఫ్లిప్కార్ట్ గ్రూప్ ఐపీఓకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ నాయకత్వ మార్పు వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. నందితా సిన్హా గత పదేళ్లకు పైగా ఫ్లిప్కార్ట్ ఎకోసిస్టమ్లో భాగంగా ఉన్నారు. 2013లో కంపెనీలో చేరిన ఆమె, క్రమక్రమంగా ఉన్నత పదవులకు చేరుకున్నారు. జనవరి 2022లో మింత్రా సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ఆమె, ప్లాట్ఫామ్ వ్యాపార పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారు. ఆమె నాయకత్వంలో మిత్రా తన మార్కెట్ పరిధిని విస్తరించడమే కాకుండా, లాభాల్లోకి అడుగుపెట్టింది. 'బిగ్ బిలియన్ డేస్' వంటి ప్రతిష్టాత్మక సేల్స్ ఈవెంట్లను విజయవంతంగా నడిపించడంలో ఆమె కృషి ఎంతో ఉంది. ఫ్లిప్కార్ట్ పబ్లిక్ లిస్టింగ్ కు సిద్ధమవుతున్న నేపథ్యంలో టాప్ లీడర్షిప్లో జరుగుతున్న మార్పులలో భాగంగానే ఈ రాజీనామా కూడా చోటుచేసుకుంది. ప్రస్తుతం అమెజాన్ ఫ్యాషన్, అజియో, నైకా ఫ్యాషన్ వంటి దిగ్గజాలతో మింత్రా గట్టి పోటీని ఎదుర్కొంటోంది. నందితా సిన్హా స్థానంలో బాధ్యతలు తీసుకోబోతున్న షారోన్ పైస్, గతంలో మింత్రా చీఫ్ బిజినెస్ ఆఫీసర్గా పనిచేశారు. కాబట్టి ఈ మార్పు వల్ల సంస్థ వ్యూహాల్లో కొనసాగింపు ఉంటుందని భావిస్తున్నారు.
0 Comments