టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నాసిక్ సెంటర్ లో వెలుగుచూసిన లైంగిక వేధింపులు మరియు బలవంతపు మతమార్పిడుల వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నిదా ఖాన్ తల్లిదండ్రులు తాజాగా చేసిన ఆరోపణలతో ఈ కేసు సరికొత్త మలుపు తిరిగింది. తమ కుమార్తెపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని నిదా ఖాన్ తల్లిదండ్రులు మీడియా ముందు వాపోయారు. నాసిక్కు చెందిన ఒక 'దొంగ బాబా' అశోక్ ఖరత్పై ఉన్న అత్యాచారం ఆరోపణల నుంచి అతడిని తప్పించేందుకే, రాజకీయ ప్రేరేపితంగా తమ కుమార్తెను ఈ కేసులో ఇరికించారని వారు ఆరోపించారు. నిదా ప్రస్తుతం గర్భవతి అని, ఆమె ఎవరినీ మతం మారమని ఒత్తిడి చేయలేదని వారు స్పష్టం చేశారు. అయితే, పోలీసులు మాత్రం నిదా ఖాన్ బాధితులను నిందితులకు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించిందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కంపెనీ ప్రతిష్టకు భంగం కలిగించే ఇటువంటి చర్యలను సహించేది లేదని స్పష్టం చేస్తూ, బోర్డులోని స్వతంత్ర డైరెక్టర్ కేకీ మిస్త్రీ నేతృత్వంలో ఒక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి తోడు డెలాయిట్, ట్రైలీగల్ వంటి స్వతంత్ర సంస్థలతో లోతైన విచారణ జరిపిస్తున్నారు. ప్రాథమిక విచారణలో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరు ఉద్యోగులను కంపెనీ సస్పెండ్ చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ప్రత్యేక విచారణ బృందం ఇప్పటికే ఏడుగురు పురుషులు, ఒక మహిళను అదుపులోకి తీసుకుంది. పరారీలో ఉన్న నిదా ఖాన్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. గడచిన నాలుగేళ్లుగా ఈ అక్రమాలు జరుగుతున్నాయని బాధితులు ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం.
0 Comments