ఢిల్లీలో జరిగిన సమావేశంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ లతో రాష్ట్రాన్ని గ్రీన్ ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృతంగా చర్చలు జరిపారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలను వివరించారు. ఈ సందర్భంగా బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సీఎం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. గ్రీన్ స్టీల్ ఉత్పత్తి ద్వారా కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటంతో పాటు దేశంలో ఉక్కు కొరతను తగ్గించవచ్చని ఆయన వివరించారు. అంతేకాకుండా పాత వాహనాల స్క్రాప్ను ఉపయోగించి ఉక్కును రీసైక్లింగ్ చేసే ఆధునిక పరిశ్రమను తెలంగాణలో ఏర్పాటు చేయాలని కూడా కోరారు. ఇది సర్క్యులర్ ఎకానమీకి బలాన్నిస్తూ, వ్యర్థాలను విలువైన వనరులుగా మార్చే దిశగా కీలకంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలానే 'తెలంగాణ రైజింగ్-2047' విజన్లో భాగంగా రాష్ట్రాన్ని పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలను సీఎం కేంద్ర మంత్రులకు వివరించారు. ఇప్పటికే ఉన్న మౌలిక వసతులు, నైపుణ్య మానవ వనరులు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం వల్ల హైదరాబాదు దేశ పారిశ్రామిక ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా ఎదగగలదని ఆయన తెలిపారు. హైదరాబాద్ను భవిష్యత్ పరిశ్రమల హబ్గా అభివృద్ధి చేయడానికి హైడ్రోజన్ టెక్నాలజీ ఆధారంగా గ్రీన్ స్టీల్ క్లస్టర్ను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఆటోమొబైల్, రక్షణ రంగాలకు అవసరమైన అధునాతన ఉత్పత్తుల తయారీ యూనిట్లు స్థాపించాలని కూడా కోరారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడం అత్యవసరమని ఆయన వివరించారు. మెషిన్ టూల్స్, రోబోటిక్స్, ఆటోమేషన్ వంటి ఆధునిక రంగాల కోసం ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్క్ను అభివృద్ధి చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ పార్క్ ద్వారా హైటెక్ తయారీ రంగంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ను 2034 నాటికి కాలుష్యరహిత నగరంగా మార్చే దిశగా కూడా సీఎం దృష్టి సారించారు. ఇందుకోసం సంప్రదాయ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్పిడి చేయడానికి కేంద్ర సహకారం అవసరమని కోరారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను కూడా పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్కు మార్చే ప్రణాళికలను ఆయన సూచించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరాజు, కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ ప్రత్యేక కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments