Ad Code

త్వరలో వరంగల్‌, ఆదిలాబాద్ విమానాశ్రయాల నిర్మాణం ప్రారంభం


తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో నూతన విమానాశ్రయాలు నిర్మించబోతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. వరంగల్ విమానాశ్రయానికి మూడు నెలల్లో శంకుస్థాపన జరగనుందని, అలాగే ఆదిలాబాద్‌లోనూ మరో కొత్త ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖ నిర్ణయం తీసుకుందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆదిలాబాద్‌లో రక్షణ శాఖకు చెందిన 360 ఎకరాల్లో నూతన ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విమానాశ్రయాన్ని రక్షణ శాఖ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. రక్షణ శాఖకు సంబంధించి శిక్షణ కోసం ఈ విమానాశ్రయాన్ని వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించినట్లు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. అదే విమానాశ్రయంలో పౌర విమానయాన శాఖ టెర్మినల్ నిర్మాణం చేసుకునేందుకు రక్షణ మంత్రి అంగీకారం తెలిపారని ఆయన చెప్పారు. రక్షణ శాఖ అవసరాలతోపాటు సాధారణ విమాన సర్వీసులు కూడా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ తెలిపారు. ఈనెల 17వ తేదీన అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం రక్షణ శాఖ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. త్వరలోనే వరంగల్‌, ఆదిలాబాద్ విమానాశ్రయాల నిర్మాణం ప్రారంభం కానుందంటూ తీపి కబురు చెప్పారు. సుమారు 430 ఎకరాలుంటే ఎయిర్ బస్ రాకపోకలకు వీలుగా విమానాశ్రయం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు.

Post a Comment

0 Comments

Close Menu