Ad Code

కూరగాయల ధరలపై యుద్ధ ప్రభావం : డిమాండ్ తగ్గి, దారుణంగా పడిపోయిన ధరలు


బెంగళూరులో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల కొరత ఏర్పడటంతో ఆర్థిక కార్యకలాపాలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. దీని ప్రభావం కేవలం హోటళ్లు, పీజీలకే పరిమితం కాకుండా, నగరంలోని ప్రధాన కూరగాయల మార్కెట్లపై కూడా పడింది. గ్యాస్ దొరక్క హోటళ్లు వంటలు ఆపేయడంతో కూరగాయలకు డిమాండ్ తగ్గి, ధరలు దారుణంగా పడిపోయాయి. బెంగళూరులోనే అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్ అయిన కేఆర్ మార్కెట్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే వ్యాపారం ఏకంగా 70 శాతం క్షీణించినట్లు వ్యాపారులు వాపోతున్నారు. హోటళ్లు, పేయింగ్ గెస్ట్ వసతి గృహాల వారు కూరగాయలు కొనడం మానేశారు. సిలిండర్లు లేక కిచెన్లు చల్లబడటంతో మార్కెట్‌కు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో తెచ్చిన సరుకు అమ్ముడుపోక వ్యాపారులు నష్టపోతున్నారు. డిమాండ్ లేకపోవడంతో మార్కెట్‌లో కూరగాయల ధరలు భారీగా పడిపోయాయి. గత నెల రూ.25 ఉన్న ఉల్లిపాయల ధర ఇప్పుడు రూ.20 కి చేరింది. గత ఏడాది ఇదే సమయంలో ఉల్లి ధర రూ.40 గా ఉండేది. ఆలుగడ్డ ధర రూ.15 కి పడిపోగా, వెల్లుల్లి ధర కూడా సగానికి పైగా తగ్గింది. క్యారెట్, బెండకాయ, వంకాయ వంటి కూరగాయల ధరలు కూడా రూ.20 నుంచి రూ.30 మధ్యకు చేరుకున్నాయి. గతంలో గల్ఫ్ దేశాలకు ఎగుమతి అయ్యే ఉల్లి, టమోటా, ఆలుగడ్డలు ఇప్పుడు యుద్ధం కారణంగా స్థానిక మార్కెట్లకు మళ్లించడంతో సరఫరా పెరిగి ధరలు మరింత తగ్గాయి. కేవలం వంట గ్యాస్ మాత్రమే కాకుండా, ఆటోలకు వాడే ఎల్‌పీజీ కొరత కూడా వేధిస్తోంది. గ్యాస్ స్టేషన్ల వద్ద స్టాక్ లేకపోవడంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారు. మరోవైపు, పంటలు బాగా పండినప్పటికీ సరైన ధరలు రాక రైతులు కన్నీరు పెడుతున్నారు. "కూరగాయలు పండిస్తున్నాం కానీ కొనేవారు లేరు. అమ్ముదామంటే కనీస పెట్టుబడి కూడా రావడం లేదు" అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్యాస్ సంక్షోభం ఇలాగే కొనసాగితే రవాణా, ఆహార , వ్యవసాయ రంగాలపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని, నష్టపోతున్న రైతులు , వ్యాపారులను ఆదుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu