Ad Code

బెంగళూరులో పెరిగిన ఆహార పదార్థాల ధరలు


బెంగుళూరులోని చిన్న, పెద్ద హోటళ్లు తమ మెనూ ధరలను సవరించాయి. పొద్దున్నే తినే ఇడ్లీ నుంచి మధ్యాహ్నం భోజనం వరకు అన్నింటిపై ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో హోటల్ యజమానులు ప్రతి ఐటమ్ మీద రూ.5 నుంచి రూ.10 వరకు పెంచారు. ముఖ్యంగా దోశ, ఇడ్లీ, చపాతీ వంటి రెగ్యులర్ టిఫిన్ల ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. కస్టమర్లు ధరల పెంపు పట్ల అసంతృప్తిగా ఉన్నప్పటికీ, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రేట్లకే భోజనం చేస్తున్నారు. నగరంలోని కదంబ హోటల్ వంటి ప్రముఖ హోటల్స్ సైతం తమ ఆపరేషన్ ఖర్చులు తట్టుకోలేక ధరలు పెంచక తప్పలేదని చెబుతున్నాయి. గ్యాస్ ధరలు పెరగడమే కాకుండా, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరత కూడా వేధిస్తోంది. వారానికి ఒక సిలిండర్ కూడా దొరకడం కష్టమవుతుండటంతో, హోటల్ యజమానులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. దావణగెరె బెన్నె దోశ, హోటల్ సన్మాన్ వంటి చోట్ల వంట కోసం ఎలక్ట్రిక్ స్టీమర్లు , కట్టెల పొయ్యిలను వాడుతున్నారు. బసవగౌడ మిలిటరీ హోటల్ వంటి నాన్-వెజ్ హోటళ్లు బిర్యానీ వండటానికి ఇప్పుడు పాతకాలం నాటి కట్టెల పొయ్యిలనే వాడుతున్నాయి. గ్యాస్ కొరత వల్ల ఇలాంటి మార్పులు చేసుకోవడం తప్పనిసరి అని యజమానులు వాపోతున్నారు. హోటల్ యజమానుల సంఘం ప్రతినిధుల ప్రకారం, నిర్వహణ ఖర్చులు దాదాపు 10 నుంచి 15 శాతం వరకు పెరిగాయి. కేవలం గ్యాస్ మాత్రమే కాదు, కరెంటు బిల్లులు, వాటర్ ఛార్జీలు కూడా పెరగడం హోటల్ నిర్వహణను కష్టతరం చేస్తోంది. నూనె, పప్పు ధాన్యాల ధరలు కూడా ఆకాశాన్ని తాకడంతో, ధరలు పెంచకపోతే హోటల్ మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యతరగతి ఉద్యోగులు, బ్యాచిలర్లు , రోజూ బయట తినే వారు ఈ ధరల పెంపుతో ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ, ఇతర నగరాలతో పోలిస్తే బెంగళూరులో తిండి ధరలు పెరిగినప్పటికీ తప్పని పరిస్థితిలో భరిస్తున్నామని కస్టమర్లు అంటున్నారు. ఆయిల్ కంపెనీలు సరఫరాలో ఇబ్బంది లేదని చెప్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం చిన్న హోటళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.

Post a Comment

0 Comments

Close Menu