తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ 27 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై పేరు లేకపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అన్నామలై కోయంబత్తూరు నార్త్ నుంచి పోటీ చేయాలని పట్టుబట్టినప్పటికీ, పార్టీ అధిష్ఠానం సిట్టింగ్ ఎమ్మెల్యే, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ వైపే మొగ్గు చూపింది.ఒకవేళ కోయంబత్తూరు కాకపోయినా రామనాథపురం నుంచి అన్నామలై పోటీ చేస్తారని ప్రచారం జరిగింది, కానీ అక్కడ జి.బి.ఎస్.కె నాగేంద్రన్కు టికెట్ కేటాయించారు. దీంతో ఈ ఎన్నికల్లో అన్నామలై పోటీ చేయడం లేదని స్పష్టమైంది. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ అవినాషి (ఎస్సీ) స్థానం నుంచి పోటీచేస్తుండగా, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు మైలాపూర్ టిక్కెట్ దక్కింది. గత ఎన్నికల్లో ఆమె ఇక్కడ నుంచే పోటీచేసి ఓటమి చవిచూశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ సత్తూరు నుంచి పోటీచేస్తున్నారు. తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా బీజేపీకి 27 సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.
0 Comments