Ad Code

ఖరీఫ్‌లో డిమాండ్ ఉన్న పంటలకే ప్రాధాన్యం !


తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ కమిషన్ చైర్మన్ కొదండరెడ్డి, శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు. విత్తనాల ఎంపిక, సరఫరా, పంట ప్రణాళికలపై చర్చ జరిగింది. రైతులు ఎక్కువగా కోరుకునే, మంచి దిగుబడి ఇచ్చే, మార్కెట్లో డిమాండ్ ఉన్న రకాలనే ఈసారి అందించాలని మంత్రి సూచించారు. గత ఏడాది ఎక్కువ రకాల వల్ల మార్కెటింగ్ సమస్యలు వచ్చినట్టు గుర్తు చేశారు. అందుకే ఈసారి పరిమిత రకాలకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. బీపీటీ-5204, ఆర్ఎన్ఆర్-15048, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్‌ఎం-1638 వంటి రకాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ విత్తనాలు మే 15 నాటికి రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మే 4 నుంచి 9 వరకు నిర్వహించే రైతు ఉత్సవాల ద్వారా ఈ రకాలపై అవగాహన కల్పించనున్నారు. విత్తనాల సరఫరా కోసం సివిల్ సప్లైస్ శాఖతో సమన్వయం చేయాలని సూచించారు. సీడ్ కార్పొరేషన్‌తో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా ఇదే రకాల విత్తనాలు అందించాలని చెప్పారు. ఎంఎస్పీ విధానంపై కూడా మంత్రి స్పందించారు. కేంద్రం ధర ప్రకటిస్తుందే కానీ కొనుగోలు బాధ్యత రాష్ట్రాలపై పడుతోందని పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్రాలపై భారీ భారం పడుతోందని వివరించారు. అన్ని పంటలను కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కమిషన్ చైర్మన్ కూడా ఎంఎస్పీ నిర్ణయంలో శాస్త్రీయ విధానం పాటించడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతుల సూచనలు పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ సమావేశంలో అధికారులు, శాస్త్రవేత్తలు కలిసి రైతులకు లాభం కలిగే విధంగా ప్రణాళికలు రూపొందించేందుకు చర్యలు ప్రారంభించారు. 

Post a Comment

0 Comments

Close Menu