హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుంది. రాష్ట్ర ఖజానా అడుగంటిపోవడంతో, ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు కఠిన నిర్ణయాలను ప్రకటించింది. రాష్ట్రం గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు పాలకులు త్యాగానికి సిద్ధంగా ఉండాలి అనే సందేశమిస్తూ సీఎం తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో కోత విధిస్తూ అసెంబ్లీలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆర్థిక వ్యయాన్ని తగ్గించేందుకు రాబోయే ఆరు నెలల పాటు జీతాల్లో కోత అమలవుతుంది. ముఖ్యమంత్రి తన సొంత జీతంలో ఏకంగా 50% కోత విధించుకుని ఆదర్శంగా నిలిచారు. ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల జీతాల్లో 30%, శాసన సభ్యుల జీతాల్లో 20%, చీఫ్ సెక్రటరీ, డీజీపీ వంటి అత్యున్నత స్థాయి అధికారుల జీతాల్లో 30% కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సామాన్య ఉద్యోగులు, పెన్షనర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గ్రూప్ సి, గ్రూప్ డి సిబ్బందికి ఈ కోత నుంచి పూర్తి మినహాయింపునివ్వడం గమనార్హం. హిమాచల్ ప్రదేశ్ ఇంతటి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి ప్రధానంగా కేంద్రం నుంచి రావాల్సిన రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ నిలిచిపోవడమే కారణమని ప్రభుత్వం పేర్కొంటోంది. ఏడాదికి సుమారు రూ. 8,000 కోట్ల ఆదాయం తగ్గిపోవడంతో రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుంది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత బడ్జెట్ను రూ. 3,586 కోట్లు తగ్గించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. ఎమ్మెల్యేల స్థానిక అభివృద్ధి నిధులను కూడా సగానికి తగ్గించాల్సి వచ్చింది. ఈ కోత శాశ్వతం కాదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగైన తర్వాత పెండింగ్లో ఉన్న మొత్తాన్ని చెల్లిస్తామని సీఎం సుఖు స్పష్టం చేశారు.
0 Comments