మే 1 నుంచి ఎల్పీజీ గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానుంది. నగరాల్లో నివసించే వారు ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత, రెండో బుకింగ్ కోసం కనీసం 25 రోజుల విరామం పాటించాలి. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి ఈ గడువును 45 రోజులుగా నిర్ణయించారు. దీనివల్ల గ్యాస్ దుర్వినియోగాన్ని అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. గ్యాస్ డెలివరీ వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు ఓటీపీ ఆధారిత ప్రామాణీకరణను ఇకపై వంద శాతం తప్పనిసరి చేయనున్నారు. సిలిండర్ మీ ఇంటికి చేరినప్పుడు, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని డెలివరీ బాయ్కు చెబితేనే గ్యాస్ అందజేస్తారు. దీనివల్ల అనధికారిక వ్యక్తులకు గ్యాస్ చేరకుండా అడ్డుకోవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 98% గ్యాస్ బుకింగ్లు ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి. మే నెల నుంచి ఈ వ్యవస్థను మరింత డిజిటలైజ్ చేయాలని గ్యాస్ కంపెనీలు నిర్ణయించాయి. బుకింగ్ నుంచి డెలివరీ వరకు ప్రతి దశను ఆన్లైన్లో ట్రాక్ చేసేలా సాఫ్ట్వేర్ను అప్డేట్ చేస్తున్నారు. వినియోగదారులు తమ గ్యాస్ బుకింగ్ స్థితిని, సబ్సిడీ వివరాలను మరింత సులభంగా తెలుసుకునే వీలుంటుంది.
0 Comments