Ad Code

కళ్ళలో కారం కొట్టి కోటి రూపాయలు చోరీ చేసిన దుండగులు


హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో స్కూటీపై వెళ్తున్న ఇద్దరి కళ్ళలో కారం కొట్టి కోటి రూపాయల నగదును దోచుకెళ్ళిన ఘటన సోమవారం రాత్రి సుమారు 9:40 గంటల సమయంలో జరిగింది. కూకట్‌పల్లి పిల్లర్ నెంబర్ 825 సమీపంలో, ఏసీపీ కార్యాలయం పక్కనే ఈ ఘటన చోటుచేసుకోవటం అందర్నీ షాక్ కు గురి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బహదూర్‌పురాకు చెందిన ఏసీ మెకానిక్‌లు మహ్మద్ ఖుస్రూ , మహ్మద్ అజీముద్దీన్ కోటి రూపాయల నగదును తరలిస్తున్న క్రమంలో ఈ భారీ దోపిడీ జరిగింది. మహ్మద్ ఖుస్రూ , మహ్మద్ అజీముద్దీన్ ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు గోల్డ్ డ్రాప్ కార్టన్ బాక్స్‌లో కోటి రూపాయలను పెట్టుకుని తరలించే ప్రయత్నం చేశారు. వీరు కూకట్‌పల్లి పిల్లర్ నెంబర్ 825వద్ద ఏజెంట్ల నుంచి డబ్బులు సేకరించారు.  అయితే, వీరిని ముందుగానే గమనించిన నలుగురు దుండగులు మూడు బైక్‌లపై వెంబడించి, నగదు తీసుకున్న కేవలం 100 మీటర్ల దూరం వెళ్లగానే, దుండగులు వారి కళ్ళలో కారం పొడి చల్లి దాడి చేశారు. దీంతో బాధితులు కిందపడిపోయారు. వెంటనే నగదు ఉన్న బాక్స్‌ను లాక్కుని దుండగులు పరారయ్యారు. దోపిడీకి ప్యాషన్ ప్లస్, ఎఫ్‌జెడ్ మోడల్ బైక్‌లను వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దోపిడీ సొమ్ము హవాలాకు సంబంధించినది అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. దోపిడీకి పాల్పడిన వారు లోపలి వ్యక్తుల సమాచారం మేరకే దోపిడీ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు ఈ కేసును అనేక కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు..ప్రస్తుతం పోలీసులు బాధితులను అదుపులోకి తీసుకుని, ఈ డబ్బు ఎక్కడ నుండి వచ్చింది? ఎవరికి సంబంధించినది? ఎక్కడకు తీసుకు వెళ్తున్నారు? అంటూ అన్ని వివరాల కూపీ లాగే పనిలో పడ్డారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటన జనం తిరుగుతున్న సమయంలోనే జరగగా, నగర భద్రతా వ్యవస్థపై ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ ఘటన నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu