ఆంధ్రప్రదేశ్ లో పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఈ మేరకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం వారసత్వ భూముల్ని సులువుగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వారి వారసులకు అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా ఇకపై ఈ భూముల రిజిస్ట్రేషన్కు రెవెన్యూ శాఖ సర్టిఫికెట్ అవసరం లేదని తెలిపింది. కేవలం సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని పేర్కొంది. రాష్ట్రంలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్కు రెవెన్యూ శాఖ సర్టిఫికెట్ తప్పనిసరి కాదని తెలిపింది. అయితే స్థలం యజమానులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రభుత్వం జారీ చేసిన ఈ మార్గదర్శకాలను అమలు చేయాలని ఆదేశాలు వెళ్లాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఆధారాలు లేకుండా వారసులు పూర్వీకుల నుంచి వచ్చిన భూముల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే రెవెన్యూ అధికారుల నుంచి యాజమాన్య హక్కు ఉన్నట్లు పొజిషన్ సర్టిఫికెట్ తీసుకురమ్మని రిజిస్ట్రార్లు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ శాఖ ఈ సర్టిఫికెట్ లు ఇవ్వడం లేదు. దీనికి పరిష్కారంగా ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ భూముల రిజిస్ట్రేషన్ సమయంలో ఈ ఆస్తి వారసత్వంగా వచ్చిందని, ఇతరులకు హక్కు లేదని, నిషేధిత జాబితా (22ఏ)లో లేదని కచ్చితంగా సెల్ఫ్ డిక్లరేషన్ డాక్యుమెంట్లో ప్రస్తావించాల్సి ఉంటుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ సమయంలో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. రిజిస్ట్రార్లు ఆధార్ బయోమెట్రిక్ ధ్రువీకరణ తప్పనిసరి చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
0 Comments