ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం అనేక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అమరావతి లో నిర్మాణాలు, భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీఎస్పీలోని 2, 3, 5, 6, 9, 11, 14, 16వ బెటాలియన్లలో పనిచేస్తున్న ప్రస్తుతం 300 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టులను అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లుగా స్థాయిని పెంచడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇరిగేషన్, రెవిన్యూ అంశాల పైన చర్చించిన మంత్రివర్గం పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. ఉపాధి కల్పనకు సంబంధించి కొత్త పథకానికి ఆమోదం తెలిపారు. పారిశ్రామిక ప్రాజెక్టులు సరైన సమయం లో అమలు జరగడానికి, పారిశ్రామికవేత్తలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి రుణ సహాయం సులభంగా పొందడానికి, రాష్ట్రంలో వ్యాపారం చేయడం మరింత సులువు చేయడానికి, పెట్టుబడులు వేగవంతం చేయడానికి, ఉపాధి అవకాశాలు పెంచడానికి అవసరమైన చర్యలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఎలాంటి అభ్యంతరాలు లేని 66,157 ఎకరాల ఏపీఐఐసీ భూములను సెక్షన్ 22-A నిషేధిత జాబితా నుంచి తక్షణమే తొలగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ పేరిట ప్రతిపాదిత పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద దాదాపు 3,500 మంది మైక్రో ఎంటర్ప్రెన్యూర్లకు వారి తయారీ కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందనుంది.
0 Comments