రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఎలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టంచేశారు. ఈనెల 7న రాష్ట్రపతి పర్యటన సందర్భంగా చిన్న వేదిక ఏర్పాటు చేయడం, తక్కువ మంది హాజరు కావడం, మమతాబెనర్జీతో సహా రాష్ట్ర ముఖ్యమంత్రులు గైర్హాజరు కావడంపై రాష్ట్రపతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చర్యను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు బీజేపీ నేతలు ఖండించారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రపతి వ్యాఖ్యలను బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ఈవెంట్ను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సరిగా నిర్వహించలేకపోయిందంటూ బీజేపీ విమర్శించడాన్ని తప్పుపట్టారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇదే తరహా ఘటనలు జరిగినప్పుడు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. నిర్వహణా లోపం జరిగి ఉంటే అది ప్రైవేటు నిర్వాహకులు, ఎయిర్ ఫోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా వల్లేనని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వల్ల కాదని మమత వివరణ ఇచ్చారు. రాష్ట్రపతి కార్యాలయం పట్ల రాష్ట్రానికి సంపూర్ణమైన గౌరవం ఉందని, ఎలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరలేదని చెప్పారు. జిల్లా యంత్రాంగం ఎలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడలేదని చెప్పారు. బీజేపీనే సొంత పార్టీ ఎజెండాతో రాష్ట్రపతి హోదాను అగౌరవపరుస్తూ, దుర్వినియోగం చేస్తోందని తప్పుపట్టారు. ప్రోగ్రాం వివరాల గురించి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ముందస్తు సమాచారం లేదని సీఎం తెలిపారు. 'గిరిజనులపై దౌర్జన్యాలు జరుగుతుంటే మీరెందుకు నిరసన చెప్పలేదు? ఎంపీ, సీజీలో ఇవి జరిగినప్పుడు ఎందుకు నిరసన చెప్పలేకపోయారు? వాళ్ల కోసం మీరు ఎందుకు ఏమీ చేయలేకపోయారు. బీజేపీ కోసం రాజకీయాలు చేయవద్దు, చెయిర్ను దిగజార్చకండి' అని మమతాబెనర్జీ అన్నారు. ఏడాదికి ఒకసారి వస్తే ఆహ్వానించగలనని, ఎన్నికల సమయంలో వస్తే అది తనకు సాధ్యం కాదని రాష్ట్రపతి పర్యటనను ఉద్దేశించి అన్నారు.
0 Comments