ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను తొలగించాలంటూ ప్రతిపక్షాల కూటమి 'ఇండియా బ్లాక్' పార్లమెంటులో నోటీసు సమర్పించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ని తొలగించాలంటూ పార్లమెంటులో నోటీసు సమర్పించడం ఇదే మొదటిసారి. 130మంది లోక్సభ సభ్యులు, 63మంది రాజ్యసభ సభ్యులు ఈ నోటీసుపై సంతకం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా బ్లాక్లో లేనప్పటికీ ఈ బిల్లుపై ఆ పార్టీ ఎంపీలు సైతం సంతకం చేశారు. స్వతంత్ర ఎంపీలు కూడా సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నోటీసులో సీఈసీపై ఏడు అభియోగాలు పేర్కొన్నారు. 'విధుల్లో పక్షపాత మరియు వివక్షతతో కూడిన ప్రవర్తన', 'ఎన్నికల్లో మోసంపై దర్యాప్తును ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకోవడం', 'సామూహికంగా ఓటు హక్కును కోల్పోవడం' వంటివి నమోదు చేశారు. పాలక బిజెపికి సిఇసి అనేక సందర్భాల్లో సహాయం చేశారని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎస్ఐఆర్పై మండిపడ్డాయి. ఇది కేంద్రంలోని అధికార పార్టీకి సహాయం చేయడమే లక్ష్యంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. జడ్జీల (విచారణ) చట్టం, 1968 ప్రకారం, పార్లమెంటు ఉభయ సభల్లో ఒకే రోజున తీర్మానానికి నోటీసులు ఇస్తే, తీర్మానానికి ఉభయ సభల్లో ఆమోదించకపోతే ఎటువంటి కమిటీని ఏర్పాటు చేయకూడదు. తీర్మానాన్ని రెండు సభల్లో ఆమోదించిన అనంతరం, స్పీకర్ మరియు చైర్మన్ సంయుక్తంగా కమిటీని నియమించాల్సి వుంటుంది.
0 Comments