Ad Code

పాక్ జట్టు ప్రక్షాళన పేరిట నాశనం చేస్తున్నసెలక్షన్ కమిటీ !


పాకిస్థాన్ క్రికెట్ సెలక్షన్ కమిటీపై ఆ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా తన అల్లుడు షాహిన్ షా అఫ్రిదికి వన్డే కెప్టెన్సీ ఎందుకు ఇచ్చారని మండిపడ్డాడు. జట్టు ప్రక్షాళన పేరిట నాశనం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ పరాజయం అనంతరం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్.. మూడు వన్డేల సిరీస్‌ను 1-2తో కోల్పోయింది. పసికూన బంగ్లాదేశ్ చేతిలో పాక్ ఓడిపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. షాహిద్ అఫ్రిది కూడా తన ఎక్స్ వేదికగా ఓ వీడియోను పంచుకున్నాడు. ఈ వీడియోలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)తో పాటు సెలెక్షన్ కమిటీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన అల్లుడు షాహీన్ అఫ్రిదిని వన్డే కెప్టెన్‌గా నియమించడాన్ని తప్పుబట్టాడు. 'టీ20 ప్రపంచకప్ 2026తో పాటు బంగ్లాదేశ్ పర్యటనలోనూ పాకిస్థాన్ జట్టు పేలవమైన ప్రదర్శన చేసింది. ఎంతో క్రికెట్ ఆడిన అనుభవం కలిగిన సెలక్షన్ కమిటీ సభ్యులకు ఏ ఫార్మాట్‌కు ఎవరిని కెప్టెన్‌గా నియమించాలనే కనీస అవగాహన లేదా  అని ప్రశ్నించాడు. జట్టు ప్రక్షాళన పేరిట తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వన్డేల్లో మెరుగైన రికార్డులున్న సీనియర్ ఆటగాళ్లను తప్పించి, కొద్ది పాటి దేశవాళీ మ్యాచ్‌లు ఆడిన యువ ఆటగాళ్లను ఎంపిక చేశారు. పాక్ దేశవాళీ క్రికెట్ స్థాయి బాగాలేనప్పుడు యువ ఆటగాళ్లను నేరుగా జాతీయ జట్టులోకి తీసుకోవడం సరి కాదు. అసలు ప్రక్షాళన ముందుగా సెలక్షన్ కమిటీలో చేయాలని'అని ఈ వీడియో అఫ్రిది స్పష్టం చేశాడు.

Post a Comment

0 Comments

Close Menu