Ad Code

స్టేటస్‌కో ఆదేశాల తర్వాత చేపట్టిన నిర్మాణాలు, బోర్డులను తొలగించాలి : హైడ్రాను ఆదేశించిన హైకోర్టు


హైదరాబాద్‌ లోని బాగ్‌ అంబర్‌పేట్‌లోని బతుకమ్మ కుంట వివాదాస్పద భూమిలో స్టేటస్‌కో ఆదేశాల తర్వాత చేపట్టిన నిర్మాణాలు, బోర్డులను తొలగించాలని హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. సివిల్‌ అప్పీలులో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించి హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు పేర్కొంది. తొలగింపునకు నేటి నుంచి నాలుగు వారాల వ్యవధి ఇస్తున్నామని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్‌ 27కు వాయిదా వేసింది. ఆలోగా నిర్మాణాలను తొలగించినట్లు నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది. బాగ్‌ అంబర్‌పేటలో సర్వే నంబర్‌ 563/1 పరిధిలోని 7 గుంటల భూ వివాదంలో ఏ.సుధాకర్‌ రెడ్డి హక్కులకు భంగం కలిగించమనే హామీకి లోబడి, వరదలను నివారణకు పరిమిత పనులను చేపట్టేందుకు న్యాయస్థానం 2025, జూన్‌ 12న అనుమతి ఇచ్చింది. ఈ ఉత్తర్వులను హైడ్రా ఉల్లంఘించినందున కమిషనర్‌ రంగనాథ్‌పై ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ సుధాకర్‌రెడ్డి హైకోర్టులో ధిక్కరణ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ మౌషుమి భట్టాచార్య, జస్టిస్‌ బీఆర్‌ మధుసూదన్‌రావు ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. 

Post a Comment

0 Comments

Close Menu